గ్రీన్ రాజమండ్రి… ఆరోగ్య రాజమండ్రి మా బాధ్యత
నాటిన చెట్టును ఒకరు దత్తత తీసుకుని పెంచుతారు
భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు మేలు చేస్తాం
కార్మికులు సేద తీరేందుకు చెట్టు నీడ
చెట్టు స్వచ్చమైన ఆక్సిజన్ ఇస్తుంది
ఈ చెట్ల వల్ల రాజమండ్రిలో ఒక సెల్సియస్ డిగ్రీ వేడితగ్గినా సంతోషమే
కూటమి నాయకులంతా దీనిని బాధ్యతగా తీసుకుంటున్నాం
దేవీచౌక్ నుంచి పేపరు మిల్లులకు వెళ్ళే రోడ్డులో చెట్లు నాటిన ఎమ్మెల్యే
ఆదిరెడ్డి శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి సాధించేందుకు రాజమండ్రి నగరంలో మొక్కలు కాకుండా ఏకంగా 1000 చెట్లు దశల వారీగా నాటుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. గ్రీన్ రాజమండ్రి – ఆరోగ్య రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా శనివారం దేవీచౌక్ నుంచి పేపరు మిల్లుకు వెళ్ళే ప్రధాన రహదారిలో ఆయన చెట్లు నాటే కార్యక్రమానికి జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి మాటూరి సిద్ధు సారధ్యంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్ని చెట్లు నాటుదామని అడిగితే 11 నాటుదామని తమ నాయకులు చెప్పారని, ఎందుకంటే తమ వాళ్ళు 11 సంఖ్యను మర్చిపోలేకపోతున్నారని చలోక్తిగా అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో 11 చెట్లు నాటుతున్నామని, ఒక్కో చెట్టును ఒకరు దత్తత తీసుకుని పెంచుతారని చెప్పారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.
ఖర్చు కోసం చూడకుండా ఏకంగా చెట్లు నాటుతున్నామని, ఇది పదిమంది ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు. అందరూ కలిసికట్టుగా ఎలాంటి స్వార్దం లేకుండా ఈ పని చేస్తున్నామని ఆయన తెలిపారు. దేవీచౌక్ లో రోజూ పనుల కోసం వచ్చే వందలాదిమంది కార్మికులకు నీడ కరువైందని, వారందరు ఈ చెట్ల నీడన సేదతీరవచ్చని ఆయన అన్నారు. సంవత్సరంలో ఈ చెట్లు చాలా పెద్దది అవుతుందని దానిని చూస్తే సంతోషం కలుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ చెట్లువల్ల రాజమండ్రి నగరంలో ఒక సెల్సియస్ డిగ్రీ ఉష్ణోగ్రత తగ్గినా చాలని, రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెట్లు పెంచడంవల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయట, ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం కూడా చెట్లు నాటుదామని మిగతా వారు అనుకుంటే సంతోషమని ఆయన అన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ఇలాంటి ప్రాంతాల్లో చెట్లు ఉంటే స్వచ్చమైన ఆక్సిజన్ కూడా అందుతుందని ఆయన చెప్పారు.
భవిష్యత్తు తరాలవారికి ఈ చెట్లు ఉపయోగపడే విధంగా నాటుతున్నామని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మొక్కలు నాటి పెంచడం వల్ల పచ్చదనం, ఆరోగ్యం పెరుగుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం బాధ్యతగా పని చేస్తుందని ఆయన అన్నారు. గ్రీన్ రాజమండ్రి – ఆరోగ్య రాజమండ్రి కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నామని హోటళ్ళలో అన్నీ క్వాలిటీతో ఉన్నవి వాడుతున్నారా లేదా అని తనిఖీ చేస్తున్నామని ఆయన చెప్పారు. మనం మంచి సంకల్పంతో ఒకడుగు ముందుకు వేస్తే ప్రకృతి, భగవంతుడు మనకు సహకరిస్తారని ఆయన అన్నారు. కూటమి నాయకులంతా ప్రజలకు మంచి చేసే పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశి నవీన్ కుమార్, వర్రే శ్రీనివాస్, మజ్జి రాంబాబు, రెడ్డి మానేశ్వరరావు, బుడ్డిగ రాధా, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


