Rs. 72 Lakh Cash Seized : అంతర్రాష్ట్ర బస్సులో పట్టుబడిన రూ.72 లక్షల నగదు.. ఇద్దరు అరెస్టు

TRINETHRAM NEWS

Trinethram News : కేరళ, డిసెంబర్ 04: కొట్టాయంలో అంతర్రాష్ట్ర బస్సులో లెక్కల్లో చూపని సుమారు రూ.72 లక్షల నగదును ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ, కేరళ మధ్య నడిచే అంతరాష్ట్ర బస్సులో ఈ డబ్బును గుర్తించారు. వీటిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం పండుగలు సహా కేరళలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాదకద్రవ్యాలు, నల్లధనం అక్రమ రవాణ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. కొట్టాయంలోని కురవిలంగాడ్‌లో జరిగిన తనిఖీల్లో అధికారులు బస్సులోని ఒక బ్యాగ్‌లో దాచిన నగదు కట్టలను కనుగొన్నారు. మరింత అనుమానం రావడంతో ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద మరింత నగదు ఉన్నట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.72లక్షలు ఉందని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను ఏపీకి చెందిన షేక్ జాఫర్, షాషాస్‌గా గుర్తించారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలను ఇద్దరూ సమర్పించలేకపోయారు. ఇద్దరు అనుమానితులను తదుపరి దర్యాప్తు కోసం ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. భారీగా పట్టుబడిన ఈ నగదు వెనుక హవాలా రాకెట్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ఫోన్లను కూడా జప్తు చేశారు.

ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాల వినియోగం కోసం తరలిస్తున్నారా? లేక మరేదానికోసమా? అని తెలుసుకోవడానికి సైబర్ ఫోరెన్సిక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు స్మగ్లర్లు అంతర్రాష్ట బస్సులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. చిన్న ప్రైవేట్ వాహనాల మాదిరిగా కాకుండా, బస్సులను తనిఖీల కోసం చాలా అరుదుగా ఆపివేస్తారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని చాలా అరుదుగా మాత్రమే బస్సులను తనిఖీ చేస్తుంటారు. ఈ అవకాశాన్ని కొన్ని ముఠాలు అక్రమాల కోసం వాడుకుంటున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rs. 72 lakh cash seized in interstate bus

You cannot copy content of this page

Scroll to Top