అరకులోయ డిసెంబర్ 29, (త్రినేత్రంన్యూస్) : అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలం, సుంకరమెట్ట నుండి కటికి వాటర్ ఫాల్స్ వరకు వెళ్లే రహదారి ప్రయాణికులకు ప్రాణాంతకంగా మారింది. ఈ రోడ్డుపై తరచూ జరుగుతున్న ప్రమాదాలతో స్థానిక గ్రామస్తులు, మరియు నిత్యం రద్దీగా కటిక వాటర్ ఫాల్స్ కి వెళ్లే పర్యాటకులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఆదివారం నాడు పిరిబంద గాటిలో ఓ పర్యాటకుల కారు అదుపు తప్పి పల్టీ కొట్టి బ్రిడ్జి కిందకు దొర్లింది. ప్రమాదంలో పర్యాటకులు గాయాలతో బయటపడగా, ఈ ఘటన మరోసారి అధికారుల నిర్లక్ష్యాన్ని వెలుగులోకి తెచ్చింది.
2018–19 సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద సుంకరమెట్ట నుంచి కటికి వాటర్ ఫాల్స్ వరకు 7 కిలోమీటర్ల రోడ్డును సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ పనులను వల్లభనేని వంశీ కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. అయితే 2021లో పనులు పూర్తయ్యాయని ప్రకటించినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రెండేళ్లకే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
నిబంధనల ప్రకారం ఐదేళ్ల మెయింటెనెన్స్ బాధ్యత కాంట్రాక్టర్దే అయినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా సరిగా మరమ్మత్తులు చేపట్టలేదు. ఈ విషయాన్ని పాడేరు పబ్లిక్ గ్రీవెన్స్లో అనేకసార్లు ఫిర్యాదు చేసినా, అధికారులు కేవలం ఫోటోలు తీసుకుని “పనులు మొదలయ్యాయి” అంటూ వెళ్లిపోతున్నారు తప్ప, వాస్తవంగా రోడ్డు పనులు పూర్తి కావడం లేదు.
ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయంతో వణికిపోతున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీవీటీజీ గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో, అత్యవసర పరిస్థితుల్లో కూడా రాకపోకలు కష్టంగా మారాయి.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, సంబంధిత కాంట్రాక్టర్తో తక్షణమే మరమ్మత్తులు చేపట్టించి, నాణ్యత ప్రమాణాలతో రోడ్డు పనులు పూర్తి చేయించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరో పెద్ద ప్రమాదం జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


