Shubhankara Maha Ganapati : ఈ ఏడాది పుష్కర్ ఘాట్ లో ‘శుభంకర మహా గణపతి

TRINETHRAM NEWS

శుభాలు కల్గించే నూలుపోగులతో కొలువుదీరుతోంది

రాజమహేంద్రి గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకురాలు జక్కంపూడి విజయలక్షి వెల్లడి

రాజమహేంద్రవరం, ఆగస్టు 25: త్రినేత్రం న్యూస్, గడిచిన 15ఏళ్లుగా ప్రతియేటా ఒక్కొక్క రకంగా గణపతిని ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది శుభంకర మహాగణపతిని రాజమహేంద్రి గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించనున్నట్టు నిర్వాహకురాలు జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడించారు.

స్థానిక పుష్కర ఘాట్‌లో సర్వ కార్యసిద్ధి, సకల శుభాలు కలిగించే శుభంకర మహాగణపతి కొలువుదీరనున్న నేపథ్యంలో స్థానిక పుష్కర ఘాట్‌ వద్ద సోమవారం ఏర్పాటుచేసిన మీడియా జక్కంపూడి విజయలక్ష్మితో పాటు కమిటీ ప్రతినిధులు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, బైర్రాజు ప్రసాదరాజు, నందెపు శ్రీనివాస్‌ మాట్లాడారు. 2010లో జక్కంపూడి రామ్మోహనరావు వ్యవస్ధాపకునిగా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటుచేసి గణపతి నవరాత్రులు మొదలు పెట్టామని గుర్తుచేసారు. లడ్డుతో, పెన్నులతో,గాజులతో, విభూది, పసుపు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో రకంగా గణపతిని ప్రతిష్టించామని చివరి రోజున ప్రసాదంగా భక్తులకు అందించామని ఆమె గుర్తుచేసారు.

ఈ ఏడాది 16వ వార్షిక ఉత్సవాల్లో 18 అడుగులు ఎతైన శుభంకర మహా గణపతి (వినాయకి) విగ్రహాన్ని నూలు పోగులు, పసుపుతాడుతో రూపొందిస్తున్నామని విజయ లక్ష్మి చెప్పారు. స్త్రీ రూపంలో గణపతిని ప్రతిష్ట చేస్తున్నామన్నారు. ఇది ఒక విధంగా శక్తి గణపతి అని ఆమె పురాణాలను ఉటంకిస్తూ చెప్పారు. వినాయకుడి గురించి శాస్త్రపరంగా స్కంద, వాయు, లింగ, మత్స పురాణాల్లో ప్రస్తావన ఉందని ఆమె తెలిపారు. వినాయకుడిని పూజిస్తే సర్వ కార్యాలు నెరవేరతాయన్నారు.27వ తేదీ ఉదయం గణపతి హోమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 7వ తేదీన ఉదయం నిమజ్జనం, అనంతరం నూలు పోగుల వితరణ ఉంటుందని తెలిపారు.

చల్లా శంకరరావు మాట్లాడుతూ హిందువులు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా వినాయకుడిని పూజిస్తారని గుర్తుచేసారు. ఇంటి ముంగిట కూడా చాలామంది వినాయక విగ్రహాలను పెట్టుకుంటారని ప్రస్తావించారు. స్వర్గీయ జక్కంపూడి రామమోహన రావు స్థాపించిన రాజమహేంద్రి గణేష్ ఉత్సవ సమితిలో తాను బాధ్యుడిగా ఉండడం అదృష్టమన్నారు. అయ్యప్ప ఆలయం నుంచి ప్రతిరోజూ ప్రసాదాలను ఉదయం సాయంత్రం రోజుకొక రకం చొప్పున తీసుకొచ్చి పంపిణీ చేస్తామని తెలిపారు. పొలాసనాపల్లి హనుమంతరావు మాట్లాడుతూ అయ్యప్ప ఆలయం నుంచి రుచికరమైన ప్రసాదాలను తొమ్మిరోజులు ప్రత్యేకంగా తయారుచేయించి ఇక్కడ పంపిణీ చేస్తామన్నారు.

బైర్రాజు ప్రసాదరాజు మాట్లాడుతూ జక్కంపూడి రామమోహనరావు సంకల్పంతో ప్రారంభమైన గణేష్ ఉత్సవ సమితి మొదటి సంవత్సరంలోనే ఆరు టన్నుల లడ్డూ ఏర్పాటుచేసి గిన్నిస్ రికార్డు సాధించామని గుర్తుచేసారు. అలాగే రెండవ సంవత్సరంలో కూడా గిన్నీస్ రికార్డు సాధించామన్నారు.పర్యావరణ హితంగా ఇక్కడ విగ్రహం ప్రతిష్టించి గణపతి నవరాత్రులు చేస్తున్నామని గుర్తుచేసారు. ప్రతీ రోజు గణపతి హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉత్సవాల తరువాత ప్రజలకు ప్రసాద వితరణ జరుగుతుందన్నారు.

నందెపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతియేటా మాదిరిగానే ఎస్వీ మార్కెట్ లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇక్కడకు తీసుకొచ్చి సెప్టెంబరు 2న కళ్యాణం జరిపిస్తా మని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొమ్ముల సాయి,వాకచర్ల కృష్ణ, పిచ్చుక సత్యనారాయణ,నిడిగట్ల బాబ్జీ, కరుణామయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

'Shubhankara Maha Ganapati' at Pushkar Ghat

You cannot copy content of this page

Scroll to Top