అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 19: రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో షెడ్యూల్ ఏరియాకు చెందిన 4680 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి, ప్రత్యేకంగా ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కమిటీ కోరింది.
అరకులోయలో గిరిజన సంఘం భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కోకన్వీనర్ పొద్దు బాలదేవ్, మండల కోకన్వీనర్లు చట్టు మోహన్, నన్ని జన్ బాబు, పాంగి అశోక్, కిల్లో జగనాధం, పాంగి నానిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ పిలుపు మేరకు ఈ నెల 19న నిర్వహించనున్న రైల్ రోకోకు ప్రభుత్వం స్పందించిందన్నారు.
అందులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్లతో చర్చలు జరిపినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించగా, దాని ఆధారంగా నివేదిక ప్రభుత్వానికి సమర్పించారన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, రేపటి మంత్రివర్గ సమావేశంలో ఆదివాసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల రిజర్వేషన్ అంశంపై మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నప్పటికీ, ఆదివాసీ సమాజం కేవలం 100 శాతం రిజర్వేషన్కే మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఆదివాసీలు బలమైన ఉద్యమానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


