అల్లూరిజిల్లా, జూన్ 17 (త్రినేత్రం న్యూస్): ఆదివాసీ ప్రాంతాల్లో డిఆర్ డిపోల బదులు, మునుపట్లానే ఎండీయూ వాహనాల ద్వారా గ్రామాల్లోనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకువేలి మండలంలోని పలు పంచాయతీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
చినలబుడు పంచాయతీ దొరవలస, బొండాం జయంతివలస, గన్నెల సిడివలస, బస్కీ కంజరితోట, మాదాల దాబుగుడ గ్రామాల్లో నిర్వహించిన ఈ నిరసన అనంతరం, అరకువేలి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ – “రాష్ట్ర ప్రభుత్వం డిఆర్ డిపోల వద్ద రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించినప్పటినుంచి, ఐటీడీఏ పాడేరు పరిధిలోని 486 డిపోలకే సరఫరా పరిమితమైంది. అయితే ఈ డిపోలు ఆదివాసీ గ్రామాలకు 3 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రజలు కాలినడకన వెళ్లి, పొట్టకూటి పనులను వదిలేసి, ఒక్క రేషన్ బియ్యానికి ఒక రోజంతా వెచ్చించాల్సి వస్తోంది. ఇది మాకు భారంగా మారింది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అమలులో ఉన్న ఎండీయూ వాహనాల ద్వారా గ్రామగ్రామానకూ బియ్యం పంపిణీ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని, రేషన్ బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి జి.బుజ్జిబాబు, నాయకులు కె.సుబ్బారావు, పరశురాం, రమేష్, ఓ.అప్పలస్వామి, ముసిరి మల్లన్న, టీ.కన్నయ్య, బలరాం రాజు, సింహాద్రి, సోమన్న, ప్రమీల, లక్ష్మి, అప్పలమ్మ, రాధ, తులవతి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


