PM Modi : చమురు, గ్యాస్ సరఫరాపై ఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

TRINETHRAM NEWS
PM Modi holds high-level review of oil

PM Modi : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాల్లో సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు.

ఈ కీలక రంగాల్లో సరఫరా వ్యవస్థను నిరంతరాయంగా కొనసాగించడం, లాజిస్టిక్స్‌ను పటిష్టం చేయడం, పంపిణీ వ్యవస్థలను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై చర్చించారు. దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లలోని ఒడుదొడుకుల ప్రభావం వినియోగదారులు, పరిశ్రమలపై పడకుండా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ఉన్నతాధికారులు తెలిపారు. తగినన్ని నిల్వలను కొనసాగించేందుకు, సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రపంచ ఇంధన వాణిజ్యంలో కీలకమైన హార్ముజ్ జలసంధి వంటి సముద్ర మార్గాలకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలపై ప్రధాని మోదీ ఒకరోజు ముందే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శాంతి, స్థిరత్వం అవసరాన్ని నొక్కిచెప్పడంతో పాటు, అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

మధ్యప్రాచ్యంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంలో భాగంగా, భారతదేశం ఇప్పటికే తన చమురు దిగుమతులను అమెరికా, రష్యా, నైజీరియా వంటి దేశాల నుంచి పెంచుకుంది. ప్రస్తుతం మన చమురు దిగుమతుల్లో దాదాపు 70 శాతం గల్ఫ్ యేతర దేశాల నుంచే వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్‌పీజీ సరఫరాలో ఇబ్బందులు రాకుండా అమెరికా నుంచి కూడా దిగుమతులు చేసుకుంటున్నామని, వినియోగదారుల స్థాయిలో సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని వారు స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top