Trinethram News : మధ్యఆసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే వైపు దూసుకువెళ్తున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని నాటో ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బుధవారం నాడు ధ్వంసం చేసింది. ఇరాన్ క్షిపణి ఇరాక్, సిరియా గగనతలం దాటి తుర్కియే వైపు వెళ్తుండటాన్ని తూర్పు మధ్యధరా సముద్రంలోని నాటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సకాలంలో పసిగట్టి కూల్చివేసినట్టు తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది.
తుర్కియే హెచ్చరిక
తుర్కియే ప్రాదేశిక సమగ్రత, గగనతలాన్ని కాపాడుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని రక్షణ శాఖ తెలిపింది. ప్రతికూల చర్యలకు ఎవరు పాల్పడినా తగిన విధంగా స్పందించే హక్కు తమకుందని హెచ్చరించింది. ఘర్షణలు మరింత ముదరకుండా సంబంధిత పక్షాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇరాన్తో తుర్కియా 500 కిలోమీటర్లు సరిహద్దు కలిగి ఉంది.
నాటో సభ్యదేశంపై తొలిదాడి
కాగా, తుర్కియేపై ఇరాన్ గతంలో ఎన్నడూ దాడులు జరపలేదు. తాజా ఘర్షణల్లో ప్రధానంగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరుపుతోంది. అయితే తాజాగా నాటో సభ్యదేశమైన తుర్కియే గగనతలం పైపు ఇరాన్ క్షిపణి దూసుకురావడంతో నాటో కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే అభిప్రాయానికి తావిస్తోంది. నాటో నిబంధనల ప్రకారం ఏ ఒక్క నాటో సభ్యదేశంపై దాడి జరిగినా అది మొత్తం సభ్యదేశాలన్నింటిపై జరిపిన దాడిగా పరిగణిస్తారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


