అరకులోయ డిసెంబర్ 14, (త్రినేత్రం న్యూస్): ఆంధ్రఊటీ అరకులోయ లో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, అరకు ఘాట్ రోడ్డులో ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని అరకు సీఐ ఎల్. హిమగిరి తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆంధ్ర ఊటీగా పెరిగాంచిన అందాల అరకులోయ అందాలను తిలకించే పర్యాటకులు ,ఘాట్ రోడ్డులో అధికంగా పొగమంచు ఏర్పడటం, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా గత నాలుగు రోజుల వ్యవధిలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు పర్యాటకులు మృతి చెందడం కలకలం రేపింది.
ఈ ఘటనల నేపథ్యంలో అరకు, అనంతగిరి ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే సంబంధిత వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10,000 జరిమానా విధించడమే కాకుండా 3 నుండి 7 రోజుల వరకు జైలు శిక్ష కూడా విధించబడుతుందని సీఐ హిమగిరి హెచ్చరించారు.
అల్లూరి సీతారామ రాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, అరకు ఘాట్ రోడ్డులో రాత్రి 10 గంటల నుండి తెల్లవారి 5 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. కావున భారీ వాహనాల యజమానులు, డ్రైవర్లు ఈ నిషేధాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రయాణికులు ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా, అలానే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని అరకు సీఐ ఎల్. హిమగిరి పర్యాటకులకు మరియు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


