Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

TRINETHRAM NEWS

రాయపూర్, ఫిబ్రవరి 19: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు.. ఈ విషయాన్ని గమనించి భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగాయి.
ఇరువైపులా నుంచీ హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతుల్లో అగ్రనేతలు ఉండవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారంటూ నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు.. ఈ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది.

ఈ నేపథ్యంలో ఆ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మృతిచెందగా.. వేలాది మంది వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారు. పలువురు మావోలను ప్రభుత్వం ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తెలంగాణకు చెందిన 15మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. ఆ జాబితాలో రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, మావోయిస్టు కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, పుసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్‌, జోడే రత్నభాయి, బడే చొక్కారావుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇక ఈ రెండేళ్లలో 588 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Huge encounter in Karregutta

You cannot copy content of this page

Scroll to Top