అవి పేద ప్రజలకు ఉపయోగపడాలి
అసెంబ్లీలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Trinethram News : రాజమహేంద్రవరం : గత ప్రభుత్వహయాంలో బీసీ కమ్యూనిటీ హాళ్ళలో ఏర్పాటు చేసిన సచివాలయాలను అవసరం లేని చోట ఖాళీ చేయించి వాటిని పేద ప్రజలకు తిరిగి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం తన నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పేద బలహీన వర్గాల ప్రజలకు ఫంక్షన్లకు ,ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్ళను నిర్మించిందని తెలిపారు.
అయితే వైసీపీ అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను తీసుకు వచ్చి గత ఐదేళ్లుగా ఈ కమ్యూనిటీ హాళ్ళలో సచివాలయాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.జి ప్లస్ కమ్యూనిటీ హాళ్ళను కూడా తీసుకుని పైనా కిందా సచివాలయాలు ఏర్పాటు చేసిందని, దీనివల్ల పేద బలహీన వర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాళ్ళు అందుబాటులో లేకుండా పోయాయని ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేరే చోట నిర్వహించుకుంటున్నారని చెప్పారు.
ఇప్పడు అవసరం మేరకు సచివాలయానికి వాడుకుని, మిగతా దాన్ని తిరిగి కమ్యూనిటీ హాలుగా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ సమస్య తన నియోజకవర్గంలోనే కాదు మిగతా నియోజకవర్గాల్లో కూడా ఉండే ఉంటుందని, దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ద్వారా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


