
ఇద్దరు బూత్ లెవల్ అధికారులపై సస్పెన్షన్ – జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి టి. నిషాంతి హెచ్చరిక
Collector T Nishanthi : అల్లూరి సీతారామరాజు జిల్లా జూలై 7,( త్రినేత్రం న్యూస్): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు బూత్ లెవల్ అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి. నిషాంతి ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం కొయ్యూరు మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం అమలుపై నిర్వహించిన సమీక్షలో, కొయ్యూరు గ్రామంలోని 75, 76 బూత్ల పరిధిలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అందిన నివేదికలను పరిశీలించిన కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొయ్యూరు గ్రామపంచాయతీ పరిధిలోని బూత్ నంబర్–75కు బూత్ లెవల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జి. శివశంకర్ (ఇంజినీరింగ్ అసిస్టెంట్), బూత్ నంబర్–76కు అదనపు బూత్ లెవల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎ. నవభారతి (వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్) ఓటరు జాబితా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించకపోవడంతో వారిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనదని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు విధులు నిర్వహిస్తున్న ప్రతి అధికారి, ఉద్యోగి పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు.
అలాగే సచివాలయ సిబ్బంది పనితీరులో నిర్లక్ష్యం కనిపిస్తే, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సంబంధిత ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అన్ని మండలాల అధికారులకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe