అరకులోయ ఫిబ్రవరి 1, (త్రినేత్రం న్యూస్): అరకులోయ పర్యాటక రంగానికి సరికొత్త ఆకర్షణగా గిరిజన సంప్రదాయ ‘కౌని’ వంటకాలను విస్తృతంగా ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అరకును ప్రకృతి, సంస్కృతి, నైపుణ్యాల సమ్మేళనంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం అరకు ఫెస్టివ్ 2026లో భాగంగా నిర్వహించిన కార్నివాల్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అరకు ప్రత్యేకమైన కౌని వంటకాలు ఇకపై అరకులోయలోని అన్ని ప్రధాన రెస్టారెంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. గిరిజన సంప్రదాయ రుచులను పర్యాటకులు నేరుగా ఆస్వాదించేలా చర్యలు చేపట్టామని, దీనివల్ల స్థానిక గిరిజన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు.
అరకును కేవలం పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా, సంపూర్ణ గిరిజన సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ దృష్టి అని పేర్కొన్నారు. ట్రైబల్ మ్యూజియం నుంచి భారీ కార్నివాల్ ఉత్సవాల రెండో రోజైన శుక్రవారం సాయంత్రం ట్రైబల్ మ్యూజియం నుంచి స్థానిక డిగ్రీ కళాశాల వరకు భారీ కార్నివాల్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ, అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహితి, విజయనగరం జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దొన్నదొర, తదితరులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు.
సాంస్కృతిక కార్యక్రమాలతో కళారంగ వైభవం కార్నివాల్ అనంతరం డిగ్రీ కళాశాల ప్రధాన వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను కనువిందు చేశాయి. అస్సాం, మధ్యప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే స్థానిక విద్యార్థుల వెస్ట్రన్ డాన్స్ ప్రదర్శనలు సందడిని పెంచాయి. గిరిజన నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడమే ‘అరకు ఫెస్టివ్ 2026’ ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ, అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహితి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


