టీడీపీ నేత బాజీ చౌదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
అంబటి ఇంటి వద్ద 6 గంటలకు పైగా టీడీపీ శ్రేణుల నిరసన, ఆందోళన
తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబటిని వజ్రవాహనంలో తరలించిన పోలీసులు
అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీడీపీ మంత్రులు, నేతలు
Trinethram News : ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని నవభారత్ నగర్ లోని నివాసం నుంచి ఆయనను తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసు వాహనంలోకి ఎక్కించి తరలించారు.
వివరాల్లోకి వెళితే, గుంటూరులో తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రమైన, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని అంబటి నివాసం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దాదాపు 6 గంటలకు పైగా నిరసన కొనసాగింది. ఈ క్రమంలో ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ప్రత్యేక వజ్రవాహనంలో అక్కడి నుంచి తరలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అంబటి వ్యాఖ్యలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, హోం మంత్రి అనిత, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. అంబటి వ్యాఖ్యలు ‘దుర్మార్గం’, ‘నీచం’ అని అభివర్ణిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


