Atrocity : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్, మార్చి 14: హైదరాబాద్లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు యువతికి హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడితో బాధిత యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే నిశ్చితార్థం తర్వాత మనోహర్కు హెచ్ఐవీ ఉన్నట్టు తెలిసింది. దీంతో యువతి, ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయం మనసులో పెట్టుకున్న మనోహర్ యువతిపై కక్ష పెంచుకున్నాడు.
ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ మరోసారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ముందే సిద్ధం చేసుకున్న సిరంజితో హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఘటన తర్వాత యువతికి అస్వస్థతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అసలు విషయం బయటపడింది. దీంతో యువతి తండ్రి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మనోహర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.


