అల్లూరిజిల్లా అరకులోయ, జూలై 5 (త్రినేత్రం న్యూస్): ఏపీ టూరిజం కార్పొరేషన్ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న టూరిజం యూనిట్లను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్తలపై సిఐటియు నేతృత్వంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అరకు వ్యాలీ రిసార్ట్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు గంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న యూనిట్లను ప్రైవేటీకరించడం ఐదో షెడ్యూల్, 1/70 చట్టానికి వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ చట్టం అమలులో ఉండగా ప్రైవేటు సంస్థలకు యూనిట్లు ఎలా అప్పగించగలరు?” అని ప్రశ్నించారు. ఇటీవల రామ్ దేవ్ బాబా అరకు వచ్చి మయూరి రిసార్ట్ను తన సంస్థకు అప్పగించమని ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం ఉందని పేర్కొన్నారు.
టూరిజం శాఖ కోట్ల రూపాయల లాభాలను అందిస్తున్నదని, అలాంటి విభాగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రభుత్వ బలహీనతకే నిదర్శనమన్నారు. “కార్మికులను పర్మినెంట్ చేయకుండా, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండా, ఇప్పుడు ప్రైవేటీకరణ ప్రయోగాలు చేస్తే చూస్తూ ఊరుకోము” అని స్పష్టం చేశారు. అలాగే, టూరిజం కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా మార్చి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసమే పాలకులు గిరిజన చట్టాలను తుంచుతున్నారని మండిపడ్డారు.
ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు అంజలిరావు, బాబురావు, ధర్మ, సురేష్, సంజీవరావు, లక్ష్మి, బుద్దు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


