అన్ని దేశాలకు హెచ్చరిక.. ఇజ్రాయెల్‌ ప్రధాని సంచలన కామెంట్స్‌

TRINETHRAM NEWS

Trinethram News : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. గాజాతో జరుగుతున్న పోరులో తాము విజయం సాధించడానికి అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో హమాస్‌ వద్ద ఉన్న బంధీలను విడిచిపెట్టే వరకు సంధి ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు. కాగా, గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలై ఆరు నెలలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్‌ సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా నెతన్యాహు .. గాజాతో యుద్ధంలో విజయానికి అడుగు దూరంలోనే ఉన్నామన్నారు. ఇప్పటివరకు తాము చెల్లించిన మూల్యం ఎంతో బాధాకరమైంది, విచారకరమైనదని అన్నారు. తాము ఒప్పందానికి సిద్ధమే కానీ లొంగిపోవడం జరగదన్నారు. అంతర్జాతీయంగా తమపై వస్తోన్న ఒత్తిడిని తమపై కాకుండా హమాస్‌ వైపు మళ్లించాలన్నారు. తద్వారా బందీలు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నారు.

తమపై ఎవరు దాడి చేసినా, చేయాలని ప్రయత్నించినా.. వారిపై ప్రతిదాడులు తప్పవన్నారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోందని.. అన్ని వేళలా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడతామని అన్నారు. హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హమాస్‌ వరకు పరిమితమైన ఈ యుద్ధం.. ఇరాన్‌ జోక్యంతో మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు.. కాల్పుల విమరణ ఒప్పందానికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో కైరోలో తిరిగి మొదలవుతాయని భావిస్తోన్న తరుణంలో నెతన్యాహు ఇలా కామెంట్స్‌ చేయడం ఆందోళన కలిగిస్తోంది.

You cannot copy content of this page

Scroll to Top