Trinethram News : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పీఠం ఎక్కినప్పటి నుంచి రోజుకో బాంబ్ పేలుస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ అడ్మిన్ మరో సంచలన ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను రద్దు చేసింది.
ఈ మేరకు వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంగళవారం (మే 27) ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు యూఎస్ ఎంబసీలకు దౌత్య కేబులు ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు.
అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించేలా విదేశీ విద్యార్థులు అమెరికన్ విద్యాసంస్థల్లో ప్రవర్తిస్తున్నారని, అందుకే ఈ విదేశీ విద్యార్ధి వీసాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.
విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అమెరికా దృష్టి పెడుతుండటంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు చాలామంది యూఎస్లో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.
తాజా ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సవివరంగా మరిన్ని నిబంధనలు త్వరలో అందే అవకాశముందని అందులో వివరించారు. ఇప్పటికే బుక్ చేసుకొన్న ఇంటర్వ్యూలు మాత్రం యథాతథంగా ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


