డుంబ్రిగుడ, ఫిబ్రవరి 5, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండల కేంద్రంలోని రేషన్ డిపోలో నిత్యావసర సరుకుల పంపిణీ తీరును ఆర్డీఓ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, తహసీల్దార్ త్రివేణితో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని వారు స్వయంగా పరిశీలించారు.
తనిఖీలో భాగంగా డిపోలోని స్టాక్ రిజిస్టర్లను అధికారుల బృందం తనిఖీ చేసింది. నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, లబ్ధిదారులకు అందిస్తున్న తూకంపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ, కార్డుదారులకు కేటాయించిన సరుకులను ఎటువంటి కోత విధించకుండా పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు.
సరుకుల కోసం వచ్చిన ప్రజలతో అధికారులు నేరుగా మాట్లాడారు. ఈ-కేవైసీ ప్రక్రియ, వేలిముద్రల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సరుకులు అందేలా చూడాలని తహసీల్దార్ త్రివేణికి సూచించారు.
నిర్ణీత సమయం ప్రకారం డిపోలను తెరిచి ఉంచాలి, డిపోల వద్ద స్టాక్ వివరాలు, ధరల పట్టికను పర్యాటక బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. పంపిణీలో అవకతవకలకు పాల్పడినా లేదా సరుకులను పక్కదారి పట్టించినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


