వారి సంక్షేమానికి కృషి చేయడం మా కర్తవ్యం
ప్రాంతీయపార్టీ టీడీపీ ఇతర రాజకీయపార్టీలకు ఆదర్శం
పార్టీ కష్టకాలంలో వెన్నంటి నడిచారని మృతి చెందిన రవికుమార్ కు లోకేష్ నివాళి
మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
కార్యకర్త కుటుంబానికి బీమాతో ధీమా ఉంటుందని కృతజ్ఞతలు తెలిపిన రవికుమార్ సతీమణి వనిత
Trinethram News : రాజమహేంద్రవరం : కార్యకర్తను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల మృతిచెందిన 33వ వార్డు టీడీపీ కార్యకర్త పొన్నాడ వెంకట రవికుమార్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా నగదు మొత్తం నామిని అయిన రవి కుమార్ సతీమణి వనిత బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడే టీడీపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుందని అన్నారు. కార్యకర్తకు వచ్చే రూ.5 లక్షల బీమా మొత్తం ఎవరి ప్రమేయం లేకుండానే మృతుడి కుటుంబ సభ్యుల్లో నామిని బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని ఆయన తెలిపారు. ఆ విధంగానే మృతి చెందిన పొన్నాడ వెంకట రవి కుమార్ సతీమణి వనిత బ్యాంకు ఖాతాలో బీమా మొత్తం రూ.5 లక్షలు జమ అయిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు.
పార్టీ కోసం పని చేసిన రవి కుమార్ లేకపోయినా ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. వారి పిల్లల చదువుల కోసం తమవంతు సహాయ సహకారాలు అందచేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. రవికుమార్ కుటుంబానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఒక లేఖ పంపించారని, తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు కార్యకర్తగా పొన్నాడ వెంకట రవి కుమార్ ఎంతోసేవ చేశారని, కష్టకాలంలో పార్టీ వెన్నంటి నడిచారని ఆయన అకాల మరణం టీడీపీ కుటుంబానికి తీరని లోటని ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. రవి కుమార్ సతీమణి వనిత పేరున బ్యాంకు ఖాతాలో జమ అయిన బీమా మొత్తం రూ.5 లక్షల గురించి ఆమెకు ఆలేఖ ద్వారా తెలియ చేసినట్లు కూడా ఆయన చెప్పారు. అలాగే ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు.
అది తెలుగుదేశంపార్టీకి కార్యకర్తలు, వారి కుటుంబం పట్ల ఉండే అభిమానం, అంకితభావం, బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రవి కుమార్ సతీమణి వనిత మాట్లాడుతూ కార్యకర్తలకూ బీమా సదుపాయం ఉంటుందని తెలిసి ఎంతో ఆశ్చర్యం, సంతోషం కలిగిందని,తన భర్త అకాల మరణంతో బాధలో ఉన్న తమ కుటుంబానికి ఈ బీమా మొత్తం కొంతవరకు భరోసా కల్పించిందని, అది కాకుండా స్వయంగా రాష్ట్ర మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమకు లేఖ ద్వారా సంతాపం తెలియచేసి అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇవ్వడం ఎంతో ఆత్మ స్థైర్యం కలిగిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తమ కుటుంబానికి అండగా నిలిచి, తన ఇద్దరు పిల్లల చదువులకు సాయం అందిస్తామని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు కూడా వనిత కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశి నవీన్ కుమార్, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, సాల్మన్ రాజు, శ్యామ్, దుత్తరపు గంగాధర్, నేమాలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


