అల్లూరిజిల్లా అరకులోయ అక్టోబర్ 23, త్రినేత్రం న్యూస్ : గిరిజన ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఐద్వా జాతీయ కమిటీ కోశాధికారి ఎస్. పుణ్యవతి పిలుపునిచ్చారు. అరకు వ్యాలీ గిరిజన సంఘం భవనంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మహిళా సంఘం జిల్లా విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతుల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కార్పొరేట్ కంపెనీలు గిరిజన ప్రాంతాల సంపదను దోచుకోవడానికి చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని విమర్శించిన పుణ్యవతి, వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత మహిళా కార్యకర్తలపై ఉందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగు దేశం పార్టీలు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
మహిళా సమానత్వం, హక్కుల సాధన కోసం ఐద్వా కట్టుబడి పోరాటం చేస్తోందని చెప్పారు. మహిళలు హక్కులు, చట్టాలు తెలుసుకుని ప్రశ్నించే ధైర్యం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మహిళా సంఘాలను బలపరిచి, స్థానిక సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
దేశవ్యాప్తంగా కోటి 60 లక్షల మంది సభ్యత్వంతో ఐద్వా అతిపెద్ద మహిళా సంఘమని పుణ్యవతి వెల్లడించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం లోపంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్. హైమా, జిల్లా నాయకురాలు వివి. జయ, ఉపాధ్యక్షురాలు దేవుడమ్మ, సహాయ కార్యదర్శి శశికళ, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


