అప్సర థియేటర్ లో ప్రేక్షకుల కేరింతలు
Trinethram News : రాజమహేంద్రవరం, మే 13: అగ్రశ్రేణి నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజ్ రచన దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ యాత్ర సాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రదర్శిస్తున్న స్థానిక అప్సర థియేటర్ కి మంగళవారం ఉదయం ఆట ముగుస్తున్న వేళ చిత్ర హీరో శ్రీవిష్ణు, నటులు కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ విచ్చేసారు. డప్పు వాయిద్యాల మధ్య గీత ఫిలిమ్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు, అప్సర థియేటర్ మేనేజర్ మధు తదితరులు స్వాగతం పలికారు. థియేటర్ లోకి చిత్రబృందం అడుగుపెట్టిన వెంటనే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
ఈ సినిమా ఎలా ఉంది, నచ్చిందా , కామెడీ అదిరిందా, బాగా ఎంజాయ్ చేస్తున్నారా .. అంటూ హీరో శ్రీవిష్ణు ప్రేక్షకులను ఉద్దేశించి అనడంతో ప్రేక్షకులు బాగుందంటూ స్పందించారు. ఈనెల 9వ తేదీన విడుదలయిన సింగిల్ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని శ్రీవిష్ణు పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. వెన్నెల కిషోర్ ప్రేయసి పాత్ర గాయత్రి గురించి సినిమాలో పలుసార్లు హీరో శ్రీవిష్ణు ప్రస్తావించడం నవ్వులు పోయించింది. అదే విషయాన్ని ప్రేక్షకులు గుర్తుచేసుకుంటూ గాయత్రీ రాలేదా అంటూ ప్రశ్నించారు. దీంతో వెన్నెల కిషోర్ స్పందిస్తూ నా గాయత్రి అంత బాగుందా అంటూ నవ్వులు కురిపించారు. చిత్రంలో అపూర్వగా నటించిన కేతిక శర్మ, హరిణి గా నటించిన ఇవానా మాట్లాడుతూ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


