డిండి (గుండ్ల పల్లి) జనవరి 03 త్రినేత్రం న్యూస్. మహిళల చదువు,అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిభాయి పూలే ఆశయ సాధనకు నేటి విద్యార్థులు, యువత కృషి చేయాలని దేవరకొండ డివిజన్ మహిళా సమాఖ్య అధ్యక్షరాలు బొల్లె మంజుల శైలేష్ అన్నారు.
సావిత్రిభాయి పూలే 195వ జయంతిని డిండి మండలంలోని గోనకోల్ గ్రామంలోగల ప్రాథమిక పాఠశాల లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులకు శాలువాతో సత్కరించడం జరిగింది.
ఈసందర్భంగామాట్లాడుతూ భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా పేరు గడించారన్నారు. 19వ శతాబ్దపు ఆనాటి అజ్ఞానపు చీకట్లను చీల్చుతూ బానిస సంకెళ్లను తెంచి సమాజంలో మహిళలకు, వితంతువులకు, బాలికలకు, అణగారిన వర్గాలకు విద్య, గౌరవాన్ని సాధించిన విదుషీమణి సావిత్రిబాయి అని ఆమె అన్నారు.
సావిత్రిబాయి జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళోద్ధరణకు సావిత్రిబాయి చేసిన సేవలు అనన్యం అసామాన్యం అని అన్నారు. సావిత్రిబాయిని భారతీయ మొదటి తరం స్త్రీవాదిగా వర్ణిస్తారన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, సతీసహగమనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారన్నారు.
మగవారికి మాత్రమే చదువుకునే పరిస్థితులలో నుండి ఆడవారు కూడా చదువుకునే స్థితికి తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తి అని అన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హీనా, యాదయ్య, ఏఐఎస్ఎఫ్ దేవరకొండ డివిజన్ అధ్యక్షులు సురిగి వినయ్ కుమార్, ఏ ఐ వై ఎఫ్ నాయకులు కామేపల్లి కళ్యాణ్, దీపిక, ప్రవీణ్, విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


