TRINETHRAM NEWS

ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు ఇక నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే

ఆధార్‌ ఆధారిత వ్యవస్థకు మారటానికి డిసెంబరు 31తో ముగిసిన గడువు

దిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) ద్వారా కూలీలకు అందించే వేతనాలు ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ కానున్నాయి

కూలీల ఆధార్‌ సంఖ్యతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలకు ఇవి చేరుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏబీపీఎస్‌)కు మారటాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన చివరి గడువు డిసెంబరు 31తో ముగిసింది. ఈ గడువును ఇక మీదట పెంచబోమని ఇది వరకే కేంద్రం స్పష్టం చేసింది. అంతకుముందు నాలుగు దఫాలు (గత ఏడాది మార్చి 31, జూన్‌ 30, ఆగస్టు 31, డిసెంబరు 31 వరకు) ఈ గడువును పెంచుకుంటూ వచ్చింది

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ఉపాధి హామీ కూలీలుగా నమోదైన వారి సంఖ్య మొత్తం 25.89 కోట్లు. వీరిలో క్రియాశీల శ్రామికులు 14.28 కోట్ల మంది కాగా జాబ్‌ కార్డుతో ఆధార్‌ సీడింగ్‌ పూర్తైన వారు 13.48 కోట్ల మంది. ఆధార్‌తో అనుసంధానం జరిగిందని ధ్రువీకరణ పొందిన వారి సంఖ్య 12.90 కోట్లు. ఇప్పటి వరకు ఏబీపీఎస్‌కు అర్హులైన ఉపాధి హామీ కూలీల సంఖ్య 12.49 కోట్లుగా ఉంది

సమస్యలున్న చోట మాత్రమే మినహాయింపు

ఉపాధి హామీ కూలీలకు జనవరి 1 నుంచి ఆధార్‌ ఆధారిత చెల్లింపులను తప్పనిసరి చేయడంపై వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం రాత్రి వివరణ ఇచ్చింది. ఏదైనా గ్రామ పంచాయతీలో ఆధార్‌ ఆధారిత చెల్లింపులు చేయడానికి సాంకేతిక సమస్యలు కానీ, ఆధార్‌పరమైన ఇబ్బందులు కానీ తలెత్తినప్పుడు సంబంధిత కేసులకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. అది కూడా ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకేనని పేర్కొంది

లబ్ధిదారుతో ఆధార్‌ను అనుసంధానం చేయడం అన్నది నిరంతర ప్రక్రియ. నిజమైన లబ్ధిదారులను గుర్తించి నకిలీలను ఏరివేయడానికి ఇది ఉపయోగపడుతుంది’ అని తెలిపింది

🔹పథకం లబ్ధిదారులను తగ్గించేందుకే… కేంద్రంపై కాంగ్రెస్‌ ధ్వజం

ఉపాధి హామీ జాబ్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఆధార్‌ లేదనే సాకుతో నిరుపేదలకు సామాజిక సంక్షేమ పథకాలను దూరం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి సాంకేతికతను ఆయుధంగా ఉపయోగించుకుంటోందని ధ్వజమెత్తింది. ఆధార్‌ లేకున్నా ఉపాధి పనులకు అర్హత కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వం….ఏబీపీఎస్‌ను తప్పనిసరి చేస్తే కూలీలకు డబ్బు ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించింది