నా ఓటమికి కాంగ్రెస్ నాయకులే కారణం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి. త్రినేత్రం న్యూస్… మొగలిగిద్ద కాంగ్రెస్ నాయకుడు అంబటి రాజు సంచలన వ్యాఖ్యలు* గుర్తు కేటాయింపు జరిగిన నాటి నుండే నాకు వ్యతిరేకంగా నడిచారు* ఎన్నో ఆశలతో మొగిలిగిద్ద సర్పంచు ఎన్నికల బరిలో నిలిచాను కచ్చితంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గెలుపొందుతాను అని గట్టిగా విశ్వసించాను కానీ నమ్ముకున్నవారే నా కొంప ముంచారు.. స్వయంగా మా పార్టీలోనే నా ఓటమికి కారకులయ్యారు అని ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీచేసిన గ్రామానికి చెందిన “అంబటి రాజు” వాపోయారు. హలో షాద్ నగర్ లో వచ్చిన కథనంపై ఆయన ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశాలతోనే తాను బరిలో దిగడం జరిగిందని స్పష్టం చేశారు.
తన ఓటమికి ఇతరులు కారణం కాదని, అలా తాను భావించడం లేదని తన గెలుపు కోసం సొంత పార్టీ నాయకులు ఎవరు పనిచేయలేదని, తనకు గుర్తు కేటాయించిన నాటి నుండి ఎవరు ప్రచారం సరిగ్గా చేయకుండా హోటళ్ల వద్ద, టీ షాప్ ల వద్ద టైంపాస్ చేశారే తప్ప తనకు అండగా నిలబడలేదని “అంబటి రాజు” పేర్కొన్నారు. మొదటి నుండి తమ గ్రామం పనిచేసేవాడి వెంట ఉండదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్లకు కాళ్లలో కట్టెలు పెట్టడం తప్ప మరో పని చేయరని అన్నారు. గతంలో వీర్లపల్లి శంకర్ కు గ్రామం నుండి తను గ్రామస్తుల మద్దతు కూడగట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్నవారు అందరూ అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో పని చేశారని ఎన్నికలకు ముందు అంజయ్య వెంట ఉన్నారని శంకర్ ఎమ్మెల్యేగా గెలిచాక అందరూ ఇప్పుడు పార్టీలో వచ్చినవారు ఉన్నారని తెలిపారు. పార్టీలో ఇటీవలే చేరిన వారు ఎవరు తనకు సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేదని అంబటి రాజు కుండబద్దలు కొట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో తమ గ్రామ అభివృద్ధి కోసం ఎంతో చేశారని కోట్లాది రూపాయలు వెచ్చించిన విషయం వాస్తవమేనని కానీ గ్రామస్తులు కూడా అభివృద్ధి వైపు నిలబడకుండా అవతలి పార్టీ బలపరిచిన అభ్యర్థిని నమ్మారని ఇది బాధాకరమని అంబటి రాజు వాపోయారు. తమ గ్రామం ఎంతో వైవిధ్యంగా ఉంటుందని అభివృద్ధి జరిగే వైపు ఉండకుండా అధికార పార్టీకి అండగా నిలవకుండా ఎప్పుడు ప్రతిపక్షంగా ఉంటుందని చెప్పడం గమనార్హం. ఆనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎంపికైన సమయంలో ఈ గ్రామానికి వస్తే కోడిగుడ్లు కొట్టారని, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వచ్చిన సమయంలో కూడా రాళ్లు విసిరారు ఇదొక డిఫరెంట్ గ్రామం అంటూ అంబటి రాజు తన ఆవేదన వెళ్లగక్కారు. అంతటి వాళ్ళనే అవమానించారనీ
నా పరిస్థితి గమనించవచ్చని తెలిపారు. తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాపై అప్పటి బిఆర్ఎస్ నాయకులు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టారని అయినా నేను కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నానని, ఏనాడు పార్టీని వీడి వెళ్లలేదని గుర్తు చేశారు. పార్టీలో కొత్తగా వచ్చినవారు తనకు ఎన్నికల్లో పని చేయలేదని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించలేకపోయారని వారు ప్రజల వద్దకు వెళ్లి అభివృద్ధి గురించి చెప్పలేదని టీ స్టాల్స్ వద్ద బాతకాని తప్ప మరొకటి లేదని విమర్శించారు. అంబటి రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మొగిలిగిద్ద గ్రామంతో పాటు సొంత పార్టీలో కూడా ప్రకంపనలు రేకెత్తేలా ఉన్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


