Owaisi : బీహార్‌లో ముస్లింలకు నాయకుడే లేడు: ఒవైసీ

TRINETHRAM NEWS

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటనకు ముందు ఒవైసీ కీలక వ్యాఖ్యలు

ఆర్జేడీ తమ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపణ

పొత్తు ప్రతిపాదనను తేజస్వి యాదవ్ పట్టించుకోలేదన్న అసద్

Trinethram News : బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొన్ని గంటల ముందు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గానికి ఒక నాయకుడు ఉన్నారని, కానీ 17 శాతానికి పైగా జనాభా ఉన్న ముస్లింలకు మాత్రం నాయకత్వం లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లో పర్యటిస్తున్న ఆయన, మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేలా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

“బీహార్‌లో యాదవులకు, పాశ్వాన్‌లకు, ఠాకూర్‌లకు.. ఇలా ప్రతి వర్గానికి సొంత నాయకులు ఉన్నారు. కానీ రాష్ట్ర జనాభాలో దాదాపు 19 శాతం ఉన్న ముస్లింలకు మాత్రం ఒక్క నాయకుడు కూడా లేడు” అని ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో వెలువడిన బీహార్ కులగణన సర్వే ప్రకారం, రాష్ట్రంలోని 13 కోట్ల జనాభాలో ముస్లింల వాటా 17.7 శాతంగా ఉంది. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని లక్ష్యంగా చేసుకున్నారు.

గత 2020 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురిని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కొనుగోలు చేశారని ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. “మా రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్‌ను తేజస్వి ప్రలోభపెట్టలేకపోయారు. ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవాలని మా వర్గం ప్రజలు కోరుకుంటున్నారని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో నేను సరేనన్నాను” అని ఒవైసీ వివరించారు.

పొత్తు కోసం తాము ఎంతో ప్రయత్నించినా ఆర్జేడీ స్పందించలేదని ఆయన తెలిపారు. “మా సంస్కృతి ప్రకారం, తండ్రి బతికి ఉండగా కొడుకుతో మాట్లాడం. అందుకే మా రాష్ట్ర అధ్యక్షుడు మొదట లాలూ ప్రసాద్ యాదవ్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత తేజస్వికి కూడా లేఖ పంపారు. అయినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. మేమేం చేయగలం?” అని ఒవైసీ ప్రశ్నించారు. పొత్తులో భాగంగా తాము కేవలం ఆరు సీట్లు, సీమాంచల్ అభివృద్ధి మండలి ఏర్పాటుకు లిఖితపూర్వక హామీ మాత్రమే అడిగామని, మంత్రి పదవులు కూడా వద్దన్నామని ఆయన స్పష్టం చేశారు.

దశాబ్దాలుగా ముస్లిం-యాదవ్ (ఎం-వై) సమీకరణంపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్న ఆర్జేడీ… ఒవైసీతో పొత్తు పెట్టుకుంటే తమ ప్రధాన ఓటు బ్యాంకు చీలిపోతుందనే భయంతోనే ఆయన్ను దూరం పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Muslims have no leader in Bihar

You cannot copy content of this page

Scroll to Top