మిడ్ డే మీల్ కార్మికులకు రూ.10,000 వేతనం ఇవ్వాలి – సీఐటీయూ డిమాండ్
అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్: జూన్ 13: దేశవ్యాప్తంగా జూలై 9న నిర్వహించనున్న సమ్మెను (మిడ్ డే మీల్) కార్మికులు విజయవంతం చేయాలని సీఐటీయూ, జిల్లా ఉపాధ్యక్షులు జె. భగత్రామ్ పిలుపునిచ్చారు. బుధవారం అరకువేలి స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– దేశవ్యాప్తంగా కార్మికుల పోరాటాల ఫలితంగా ఏర్పడిన 29 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లుగా రూపాంతరం చేసేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇది కార్మికుల హక్కులను హరించడమేనని, అందువల్ల దేశంలోని కార్మికులంతా ఈ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
అలాగే మధ్యాహ్న భోజనం (మిడ్ డే మిల్) కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మిడ్ డే మిల్ కార్మికులకు రూ.10,000 జీతం ఇవ్వాలని, ప్రతినెల 5వ తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థికి మెనూ చార్జీలు రూ.20కి పెంచాలని సూచించారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో మిడ్ డే మిల్ కార్మికులంతా భాగస్వాములు కావాలని కోరారు.
అంతేగాక, డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును ఎంఈఓ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దామోదర్, కన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ పిలుపు మేరకు అన్ని కార్మిక సంఘాల సమన్వయంతో ఈ సమ్మె విజయవంతం చేయాలని వారు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


