Asia Cup Super-4 : భారత్‌ సూపర్‌

TRINETHRAM NEWS

సూపర్‌ ఓవర్‌లో శ్రీలంక ఓటమి

నిస్సాంక శతకం వృథా

Trinethram News : దుబాయ్‌: ఆసియాకప్‌ సూపర్‌-4లో నామమాత్రపు మ్యాచే అయినా భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది.

అయితే 203 పరుగుల ఛేదనలో లంక ఓపెనర్‌ నిస్సాంక (58 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 107) సెంచరీతో గెలుపు దిశగా తీసుకెళ్లినా.. చివరి ఓవర్‌లో తడబాటుతో మ్యాచ్‌ను టై చేసుకుంది. ఇక సూపర్‌ ఓవర్‌లో లంక ఐదు బంతుల్లో 2/2 స్కోరుతో నిలువగా, భారత్‌ తొలి బంతికే మూడు రన్స్‌ చేసి అద్భుత విజయాన్నందుకుంది. ఆదివారం పాక్‌తో సూర్య సేన ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61), తిలక్‌ (34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 49 నాటౌట్‌), శాంసన్‌ (23 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 39) వేగంగా ఆడారు. ఆ తర్వాత భారీ ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది. కుశాల్‌ పెరీరా (32 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) సహకరించాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ మెండిస్‌ డకౌటైనా.. మరో ఓపెనర్‌ నిస్సాంక జోరుకు జట్టు తొలి 10 ఓవర్లలోనే 114/1 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. అలాగే పెరీరాతో కలిసి రెండో వికెట్‌కు 70 బంతుల్లో 127 పరుగులు జత చేశాడు. ఆఖరి ఓవర్‌లో 12 రన్స్‌ కావాల్సిన వేళ తొలి బంతికే నిస్సాంక అవుట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఇక చివరి బంతికి మూడు రన్స్‌ చేయాల్సిన వేళ లంక 2 పరుగులే తీయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. నిస్సాంకకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

కలిసికట్టుగా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఎప్పటిలాగే ఓపెనర్‌ అభిషేక్‌ మెరుపు ఆరంభాన్ని అందించగా, మిడిలార్డర్‌లో అక్షర్‌-శాంసన్‌ జోడీ భారీ స్కోరుకు సహకరించారు. మరో ఓపెనర్‌ గిల్‌ (4) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగినా.. అభిషేక్‌ దూకుడు ఆగలేదు. ప్రతీ బంతిని బాదడమే లక్ష్యంగా లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఐదో ఓవర్‌లో 6,4,4తో 15 రన్స్‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో 22 బంతుల్లోనే వరుసగా మూడో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు స్కోరు 71/1కి చేరుకుంది. కెప్టెన్‌ సూర్య (12) మాత్రం మరోసారి విఫలమై స్పిన్నర్‌ హసరంగకు చిక్కడంతో రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం తిలక్‌-శాంసన్‌ జోడీ రన్‌రేట్‌ తగ్గకుండా ఆడింది. ముఖ్యంగా శాంసన్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిస్తూ 3 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. నాలుగో వికెట్‌కు 66 రన్స్‌ జోడించాక 16వ ఓవర్‌లో శాంసన్‌ అవుటయ్యాడు. ఆ వెంటనే హార్దిక్‌ (2) నిరాశపర్చగా డెత్‌ ఓవర్లలో తిలక్‌-అక్షర్‌ (21 నాటౌట్‌) జోడీ జోరు కొనసాగించింది. చివరి బంతికి అక్షర్‌ సిక్సర్‌తో స్కోరు 200 దాటింది.

స్కోరుబోర్డు

భారత్‌: అభిషేక్‌ (సి) మెండిస్‌ (బి) అసలంక 61, గిల్‌ (సి అండ్‌ బి) తీక్షణ 4, సూర్యకుమార్‌ (ఎల్బీ) హసరంగ 12, తిలక్‌ (నాటౌట్‌) 49, శాంసన్‌ (సి) అసలంక (బి) షనక 39, హార్దిక్‌ (సి అండ్‌ బి) చమీర 2, అక్షర్‌ (నాటౌట్‌) 21, ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 202/5; వికెట్ల పతనం: 1-15, 2-74, 3-92, 4-158, 5-162; బౌలింగ్‌: తుషార 4-0-43-0, తీక్షణ 4-0-36-1, చమీర 4-0-40-1, హసరంగ 4-0-37-1, షనక 2-0-23-1, అసలంక 2-0-18-1.

శ్రీలంక: నిస్సాంక (సి) వరుణ్‌ (బి) హర్షిత్‌ 107, కుశాల్‌ మెండిస్‌ (సి) గిల్‌ (బి) హార్దిక్‌ 0, పెరీరా (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) వరుణ్‌ 58, అసలంక (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 5, మెండిస్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 3, షనక (నాటౌట్‌) 22, జనిత్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 202/5; వికెట్ల పతనం: 1-7, 2-134, 3-157, 4-163, 5-191; బౌలింగ్‌: హార్దిక్‌ 1-0-7-1, అర్ష్‌దీప్‌ 4-0-46-1, హర్షిత్‌ 4-0-54-1, అక్షర్‌ 3-0-32-0, కుల్దీప్‌ 4-0-31-1, వరుణ్‌ 4-0-31-1.

ఒకే ఆసియాక్‌పలో ఎక్కువ పరుగులు (309) సాధించిన బ్యాటర్‌గా అభిషేక్‌. అలాగే టీ20ల్లో ఎక్కువసార్లు వరుస (7) 30+ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా రిజ్వాన్‌, రోహిత్‌ తో సమంగా నిలిచాడు.

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..

శ్రీలంక (2/2) బంతి భారత్‌ (3/0)

పెరీరా (అవుట్‌) 1 సూర్య(3)

మెండిస్‌ (1) 2

షనక (0) 3

షనక (వైడ్‌, 1) 4

షనక (0) 4

షనక (అవుట్‌) 5

బౌలర్‌: అర్ష్‌దీప్‌ బౌలర్‌: హసరంగ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India Super

You cannot copy content of this page

Scroll to Top