Mon. Mar 9th, 2026

GI on Wheels : “జీఐ ఆన్ వీల్స్”: బస్సులపై జీఐ వారసత్వ ప్రదర్శనకు టీజీఎస్‌ఆర్టీసీ శ్రీకారం

TRINETHRAM NEWS

Trinethram News : జీఐ హస్తకళలతో అలంకరించిన ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించిన .. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి పొన్నం ప్రభాకర్.

దేశంలోనే తొలిసారిగా “జీఐ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని ఈ రోజు హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ , టీజీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నాగి రెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, జీఐ గుర్తింపు పొందిన కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. తెలంగాణ యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని తెలిపారు. సంస్కృతి సమాజానికి ఆత్మస్వరూపమని, సాంస్కృతిక అవగాహన లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. ఈ తరహా కార్యక్రమాలు యువతలో సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంచుతాయని, కళాకారులకు గౌరవాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.

రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం గవర్నర్ గారి దూరదృష్టి ఫలితమని తెలిపారు. జీఐ ఉత్పత్తుల ప్రాచుర్యం, మార్కెటింగ్ మరియు విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా పోచంపల్లి ఇక్కత్ వరంగల్ , వరంగల్ తివాచీలు (కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట్ చీరలు, చెరియల్ స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ వంటి తెలంగాణకు చెందిన ఆరు ప్రముఖ జీఐ హస్తకళలను బస్సులపై ప్రత్యేకంగా ప్రతిష్టించారు. ఈ కళారూపాలు తెలంగాణ కళాకారుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తూ, ప్రజా రవాణా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం పొందనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థను సృజనాత్మక వేదికగా మలచి, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా చేపట్టటం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు.

టీజీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నాగి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం గవర్నర్ గారి ఆలోచనల ఫలితమని తెలిపారు. బస్సులపై జీఐ కళారూపాలను ప్రదర్శించడం ద్వారా సంస్కృతిని ప్రజలకు చేరువ చేయడంతో పాటు కళాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యమని చెప్పారు.

ఈ బస్సులపై ప్రదర్శించిన డిజైన్లను జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) విద్యార్థులు రూపొందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు బహుమతులు మెమొంటోలు అందజేశారు. జీఐ గుర్తింపుల సాధనలో సేవలందించిన సుభజిత్ సహా ప్రత్యేకంగా సన్మానించారు. ఆరు జీఐ కళారూపాలకు చెందిన కళాకారులను కూడా ఘనంగా సత్కరించారు.

తదనంతరం గవర్నర్ , మంత్రి , జిల్లా కలెక్టర్ టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు కలిసి జీఐ హస్తకళలతో అలంకరించిన ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

భౌగోళిక సూచిక (జీఐ) అనేది ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తి లక్షణాలు, నైపుణ్యం, సంప్రదాయాన్ని ప్రతిబింబించే సమిష్టి మేధో సంపత్తి హక్కు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి 18 జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులు ఉన్నాయి. జీఐ గుర్తింపు ద్వారా సంప్రదాయ కళలు, వారసత్వాన్ని సంరక్షించడం, నకిలీలను నివారించడం, కళాకారులకు గుర్తింపు కల్పించడం, వారి జీవనోపాధిని స్థిరంగా నిలుపుటకు దోహదపడుతుంది.

ఈ కార్యక్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ రాజశేఖర్ , ఖుస్రో షా ఖాన్ , రీజినల్ మేనేజర్లు శ్రీలత,సుధ పరిమళ , జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ప్రతినిధులు, కళాకారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

GI on Wheels

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page