Gaddam Ananya : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. అభివృద్ధి పనుల సమీక్ష ..వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను, ప్రజా సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బిజెఆర్ చౌరస్తా నుండి రామయ్య గూడ వరకు క్లీన్ చేసిన ఓపెన్ డ్రైన్లను తనిఖీ చేయడంతో పాటు, రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆలంపల్లి ఈద్గా వద్ద ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆలంపల్లి బోనమ్మగుంత దేవాలయ పరిసరాలను, అనంతగిరి రోడ్డులోని పబ్లిక్ టాయిలెట్లను సందర్శించి పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని హెచ్చరించారు.
29వ వార్డు చౌదరి కాలనీలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని అకస్మికంగా తనిఖీ చేసిన చైర్పర్సన్, అక్కడ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని, వసతి గృహంలో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వార్డెన్ను ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ విక్రంసింహా రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.


