అల్లూరిజిల్లా(అనంతగిరి) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్,ఏప్రిల్ 26: అరకు నియోజకవర్గంలో క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తూ, అనంతగిరి మండలంలోని దిగు శోభ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు శుక్రవారం ఘనంగా ఆరంభం లభించింది. ఈ టోర్నమెంట్ను అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం, ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “క్రీడలు కేవలం గెలిచే కోసం మాత్రమే కాదు, అవి మనిషిని ఓర్పుతో పాటు క్రమశిక్షణకు, పాజిటివ్ ఆలోచనకు నడిపిస్తాయి. ఆటల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించగలిగిన వారే నిజమైన క్రీడాకారులు,” అని తెలిపారు. యువత క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలనే సందేశం ఇచ్చారు.
మండల స్థాయిలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో వివిధ గ్రామాల నుండి పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నారు. యువతకు క్రీడలపై ఆసక్తి పెరిగేలా ఇలాంటి పోటీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధుల పాత్ర కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా, యువతకు మార్గనిర్దేశం చేయడంలోనూ ఉండాలని ఆయన అన్నారు.
టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం “బొర్ర” గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. సిబ్బందితో సమావేశమై, సమయపాలన పాటిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే దిశగా సూచనలు చేశారు. రికార్డులను స్వయంగా పరిశీలించి, అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల జడ్పిటిసి సభ్యులు దీసరి గంగరాజు, ఎగువ శోభ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్ర సింహాద్రి, టోకూరు గ్రామ సర్పంచ్ కె. మొస్య, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం నాయక్ మురళీ, వార్డు సభ్యులు లక్ష్మణ్, ప్రసాద్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు, క్రీడాభిమానులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


