ED Arrests : రిలయన్స్ పవర్ కీలక అధికారిని అరెస్ట్ చేసిన ఈడీ

TRINETHRAM NEWS

రిలయన్స్ పవర్ ఉన్నతాధికారి అశోక్ కుమార్ పాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ

రూ.68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు

ఫేక్ ఈమెయిల్ డొమైన్లు వాడి మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు

ఉనికిలో లేని విదేశీ బ్యాంక్ బ్రాంచ్ పేరుతోనూ నకిలీ గ్యారెంటీ సృష్టి

అనిల్ అంబానీ గ్రూప్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా చర్యలు

Trinethram News : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. రూ.68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ పవర్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అశోక్ కుమార్ పాల్‌ను శనివారం అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

గత ఏడేళ్లుగా రిలయన్స్ పవర్‌లో సీఎఫ్‌వోగా పనిచేస్తున్న అశోక్ పాల్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)కి రూ.68 కోట్లకు పైగా విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారని ఈడీ ఆరోపించింది. ఈ నకిలీ గ్యారెంటీలను నిజమైనవిగా నమ్మించేందుకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి ప్రముఖ బ్యాంకుల పేర్లను పోలిన ఫేక్ ఈమెయిల్ డొమైన్లను సృష్టించి ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో అసలు ఉనికిలోనే లేని ఓ విదేశీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా గ్యారెంటీ పత్రాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ మోసంలో ఒడిశాకు చెందిన బిస్వాల్ ట్రేడ్‌లింక్ అనే చిన్న కంపెనీ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కేవలం కాగితాలపై మాత్రమే ఉన్న ఈ కంపెనీ ద్వారానే రిలయన్స్ పవర్ తరఫున నకిలీ గ్యారెంటీలను ఏర్పాటు చేసినట్లు తేలింది. ఈ ఆరోపణలకు సంబంధించి బిస్వాల్ కంపెనీ డైరెక్టర్‌ను గత ఆగస్టులోనే అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను దారి మళ్లించాయన్న ఆరోపణలపై ఈడీ ఇప్పటికే విస్తృత దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా యస్ బ్యాంక్ నుంచి పొందిన రూ.3,000 కోట్ల రుణం, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన రూ.14,000 కోట్ల మోసంపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే తాజా అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఈడీ అధికారులు అనిల్ అంబానీని కూడా విచారించిన విషయం తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ED arrests key Reliance Power official

You cannot copy content of this page

Scroll to Top