CM Revanth : జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి

TRINETHRAM NEWS

నవ ప్రపంచాన్నినిర్మిద్దాం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

ఒసాకా ఎక్స్ పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్ పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయన్నారు.

‘హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొండి..’ అని జపాన్ కంపెనీలను సీఎం తెలంగాణకు ఆహ్వానించారు.

తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయని, ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు ఒసాకా, ప్రపంచంతో కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ రంగాల పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను వివరించారు.

హైదరాబాద్ లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నామని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఈ సిటీ ఆధారపడుతుందన్నారు.

జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్లతో పాటు ఆర్ఆర్ఆర్కు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందన్నారు.

ఎగుమతులకు వీలుగా సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

మూసీ పునరుజ్జీవనంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధి చేసేందుకు టోక్యో, ఒసాకా నగరాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు.

నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister invites Japanese

You cannot copy content of this page

Scroll to Top