Subhanshu Shukla : వ్యోమగామి శుభాంశు శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ: అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు, ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఘనంగా స్వాగతించారు.

ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ)విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వ్యోమగామి శుభాన్షు శుక్లా భారత్‌ చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారం’ఎక్స్‌’లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. శుక్లా సాధించిన విజయాన్ని ప్రశంసించారు. దేశమంతా అతని విజయానికి గర్విస్తున్నదన్నారు.

భారత్‌ చేరుకున్న శుక్లా ముందుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. అనంతరం, యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. ఆ తర్వాత అక్టోబర్‌లో మొదలయ్యే గగన్‌యాన్‌ మిషన్‌ శిక్షణలో పాల్గొంటారు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్‌ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం-4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. జూన్‌ 26వ తేదీ నుంచి ఐఎస్‌ఎస్‌లో పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. శనివారం శుభాంశు విమానంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

‘నేను స్వదేశానికి చేరుకునేందుకు విమానంలో కూర్చు న్నప్పుడు, మిశ్రమ భావోద్వేగాలు కలిగాయి. గత ఏడాదికాలంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులను విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు ఓ వైపు బాధ, మిషన్‌ తర్వాత మొదటిసారిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, దేశంలోని ప్రతి ఒక్కరినీ కలవబోతున్నందుకు మరో వైపు ఉత్సాహం ఉన్నాయి. జీవితం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నాను’అని శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం హూస్టన్‌లోని భారత కాన్సులేట్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో శుక్లాతోపాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్‌ నాయర్‌ కూడా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Astronaut Subhanshu Shukla warm welcome

You cannot copy content of this page

Scroll to Top