ఆర్థిక రంగంలో ఏఐ వినియోగంపై నిఘా పెంచిన రెగ్యులేటర్లు
ఏఐ గొప్ప సాధనమే అయినా, ప్రమాదకారి కూడా అని స్కాట్ బెస్సెంట్ హెచ్చరిక
అమెరికా నిర్ణయాలు భారత టెక్ కంపెనీలపై ప్రభావం చూపే అవకాశం
ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీ కూడా మరో పెద్ద సవాల్ అని వెల్లడి
Trinethram News : అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక ముప్పుగా పరిణమించిందని, ఈ టెక్నాలజీ వినియోగంపై రెగ్యులేటర్లు నిఘాను కఠినతరం చేస్తున్నారని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్సైట్ కౌన్సిల్ (FSOC) 2025 వార్షిక నివేదికలో ఏఐని నాలుగు ప్రధాన దృష్టి సారించాల్సిన అంశాల్లో ఒకటిగా చేర్చినట్లు బెస్సెంట్ తెలిపారు. “ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించడానికి కౌన్సిల్ ప్రాధాన్యత ఇస్తోంది. ఏఐ అనేది ఒక గొప్ప సాధనం, కానీ అదే సమయంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల ద్వారా ప్రమాదకరంగా కూడా మారగలదు” అని ఆయన హెచ్చరించారు. ఫ్రాడ్ గుర్తింపు, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వాటిలో ఏఐ వినియోగం పెరుగుతోందని చెప్పారు.
పెరుగుతున్న ముప్పులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వాములతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఎఫ్ఎస్ఓసీ పనిచేస్తోందని బెస్సెంట్ వివరించారు. ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీ కూడా ఆర్థిక సంస్థలకు, కీలక మౌలిక సదుపాయాలకు పెను సవాల్గా మారిందని పేర్కొన్నారు. ఈ విచారణలో రిపబ్లికన్లు ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతించగా, డెమొక్రాట్లు మాత్రం తగిన రక్షణ చర్యలు లేకుండా ఆర్థిక ఆవిష్కరణలు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్లో బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు రుణాల జారీ, కస్టమర్ సర్వీస్ కోసం ఏఐని వేగంగా వినియోగిస్తున్న తరుణంలో అమెరికా రెగ్యులేటరీ సంకేతాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పరిణామాలు సరిహద్దు కార్యకలాపాలున్న భారత టెక్ కంపెనీలు, ఆర్థిక సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సంక్షోభాలు వచ్చాక స్పందించడం కాకుండా వ్యవస్థలో బలహీనతలను ముందుగానే గుర్తించి, వాటిని పరిష్కరించడమే తమ లక్ష్యమని బెస్సెంట్ స్పష్టం చేశారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థలో ప్రమాదాలను పర్యవేక్షించేందుకు ఎఫ్ఎస్ఓసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


