MLA Kavya Krishna Reddy : దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

TRINETHRAM NEWS
MLA Kavya Krishna Reddy launches Divyang Shakti

దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం

MLA Kavya Krishna Reddy : త్రినేత్రం న్యూస్: మార్చ్ 18: నెల్లూరు జిల్లా :కావలి దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , పేర్కొన్నారు. కావలి ఆర్టీసీ బస్టాండ్ నందు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ,దివ్యాంగ శక్తి, పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జెండా ఊపి బస్సును ప్రారంభించి, స్వయంగా దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , పని చేస్తున్నారని అన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలలో మొదటిదిగా ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని చెప్పారు. మహిళా శక్తి పథకానికి వర్తించే నిబంధనలతోనే దివ్యాంగ సోదరులు, సోదరీమణులు ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడం ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.

బీజేపీ,జనసేన–తెలుగుదేశం పార్టీలు కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పేదలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దివ్యాంగులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందినట్లే, లబ్ధిదారుల గృహాల వద్దకు వెళ్లి పెన్షన్ అందించే విధానాన్ని అమలు చేయడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించామని తెలిపారు. ఈ చర్యలు దివ్యాంగుల జీవితాల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నాయని అన్నారు. ఇప్పుడు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా దివ్యాంగులు తీర్థయాత్రలు, కుటుంబ కార్యక్రమాలు, శుభ,అశుభ సందర్భాల్లో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రయాణించగలరని ఎమ్మెల్యే వివరించారు.

ఇది వారి సామాజిక, ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే కీలక నిర్ణయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ మహోన్నత నిర్ణయాన్ని ప్రజలు అభినందించాలని, దివ్యాంగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ అభ్యున్నతికి దోహదం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం ఆనందరావు, సిఐ కల్పన, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబు రావు, కండ్లగుంట మధుబాబు నాయుడు, అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా, దేవరకొండ శ్రీను, మండవ వెంకట్రావు, జనసేన నాయకురాలు, ఏఎంసి డైరెక్టర్ కొప్పోలు లక్ష్మీ, స్థానిక నాయకులు, ఆర్టీసీ సిబ్బంది, పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top