SIT Reveals : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉన్నట్లు సిట్ ఛార్జ్‌షీట్‌లో స్పష్టం

TRINETHRAM NEWS
  • నెయ్యి టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు
  • 60 ల‌క్ష‌ల కిలోల క‌ల్తీ నెయ్యి కొనుగోలు
  • క‌ల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను త‌యారు చేసి అప‌చారం
  • హిందూ స‌మాజానికి వారు క్ష‌మాప‌ణ చెప్పాలి
  • టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు

Trinethram News : తిరుపతి, 2026 జనవరి 30 : శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని, టిటిడి పవిత్రతను భ్రష్టు పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, నెయ్యి కల్తీ జరగలేదని చెప్పడం వాస్త‌వం కాద‌ని, సిట్ ఛార్జ్‌షీట్‌లోనే కల్తీ స్పష్టంగా నమోదు అయిందని ఆయన పేర్కొన్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘన జరిగాయని, కొందరికి లాభం చేకూర్చే విధంగా నిబంధనలను మార్చారని తెలిపారు.

సరైన సామర్థ్యం లేని సంస్థలకు నెయ్యి టెండర్లు అప్పగించారని తెలిపారు. సుమారు రూ. 250 కోట్ల రూపాయలతో 60 ల‌క్ష‌ల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు జరిగిందన్నారు. ఈ నెయ్యిని ప‌రీక్షించిన NDDB జంతు కొవ్వు ఉంద‌ని నివేదిక ఇచ్చిన‌ట్లు చెప్పారు.

  ఒక్క ఆవు కూడా లేకుండా, చుక్క నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా నెయ్యి తయారు చేశామని చెప్పడం అబద్ధమని, నెయ్యి తయారీలో వాడిన కొన్ని రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రతకు తీవ్రమైన భంగం కలిగించారని పేర్కొన్నారు. కమిషన్ల కోసమే కొన్ని డైరీలను ఎంపిక చేశారని అన్నారు. హైంద‌వ‌ స‌మాజాన్ని నాశ‌నం చేయ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. గ‌త 5 సంవ‌త్స‌రాల‌లో హిందూ దేవుళ్ళ‌ను, హిందూ స‌మాజాన్ని హేళ‌న చేశార‌ని, వారంతా హిందూ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అన్నారు.

క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. నెయ్యి నాణ్యతపై తుది నిజాలు వెలుగులోకి రావాలంటే మైక్రో డీఎన్ఏ టెస్ట్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది ఖాతాల్లోకి వెళ్లిన కోట్ల రూపాయల లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని సిట్‌ను కోరారు. బ్యాంక్ ఖాతాలలో కోట్ల రూపాయలు జమ కావడం వాస్తవమా కాదా, బినామీల వెనుక అసలు పెద్దలు ఎవరో నిగ్గుతేల్చాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, టిటిడి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి రాజీ ఉండదని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

ఈ స‌మావేశంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ భాను ప్ర‌కాష్ రెడ్డి, శ్రీ‌మ‌తి ప‌న‌బాక ల‌క్ష్మీ, శ్రీ న‌రేష్‌కుమార్‌, శ్రీ డాల‌ర్ దివాక‌ర్ రెడ్డి, శ్రీ ద‌ర్శ‌న్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SIT chargesheet reveals adulterated ghee used in making Srivari Laddu

You cannot copy content of this page

Scroll to Top