Cycling Rally : అరకు ఫెస్ట్ లో ఘనంగా “సే నో టు డ్రగ్స్” సైక్లింగ్ ర్యాలీ

TRINETHRAM NEWS

42 మంది పాల్గొనగా విజేతలకు నగదు బహుమతులు

అరకు లోయ జనవరి 31, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఫెస్ట్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఉదయం లోతేరు జంక్షన్ నుంచి అరకు పైనరీ వరకు నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీ గంజాయి నిర్మూలన డ్రగ్స్ రహిత సమాజం అనే నినాదంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీ పూజ జెండా ఊపి ప్రారంభించారు.
సుమారు 25 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ర్యాలీలో మొత్తం 42 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేష్ కుమార్ మరియు ఉన్నత అధికారులు అందించారు
ఈ సైక్లింగ్ పోటీల్లో విశాఖపట్నంకి చెందిన జాతీయ సైక్లింగ్ క్రీడాకారుడు కె. వంశీ కిరణ్ ప్రథమ స్థానంలో నిలిచి రూ.25,000 నగదు బహుమతి కైవసం చేసుకున్నారు. ఎన్. అఖిలేష్ ద్వితీయ స్థానంలో నిలిచి రూ.15,000, జి. శ్యాం మనోహర్ తృతీయ స్థానంలో నిలిచి రూ.10,000 బహుమతులు అందుకున్నారు.

ఈ సందర్భంగా వంశీ కిరణ్ మాట్లాడుతూ, “అరకు లాంటి చల్లని, ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశంలో సైక్లింగ్ చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఇది జీవితంలో మరిచిపోలేని అనుభూతి” అని తెలిపారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ, గత ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న “సే నో టు డ్రగ్స్” ఉద్యమాన్ని ఈ అరకు ఫెస్టివల్ రాష్ట్రస్థాయి వేదికగా ప్రజల ముందుకు తీసుకువచ్చినట్లు చెప్పారు. యువత క్రీడల ద్వారా మంచి మార్గంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అరకు పైనరీ వద్ద అతిథులు “సే నో టు డ్రగ్స్” టీషర్టులను విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ దొన్ను దొర, టీడీపీ ఇన్‌చార్జ్ తేజవతి, అరుకు పార్లమెంట్ అబ్జర్వర్ శివరామకృష్ణ, జనసేన ఇన్‌చార్జి శెట్టి చిరంజీవి, ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మి, సర్పంచు దాస్ తదితరులు అరకు ఫెస్ట్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
గంజాయి రహిత అరకుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గిరిజన నృత్యంతో ఉత్సాహం.. కార్యక్రమంలో అతిథులు గిరిజన నృత్యంలో పాల్గొనడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ, డీఎస్పీ అభిషేక్, సహాయ కలెక్టర్ సాహిత్, ఇన్‌చార్జి డీఎఫ్ఓ కె. ఉమామహేశ్వరి, ఆర్డీఓ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

“Say No to Drugs” cycling rally held in Araku Fest

You cannot copy content of this page

Scroll to Top