
Adivasi Tribal Association : అరకులోయ,ఆగస్టు 12,( త్రినేత్రం న్యూస్) : జీఓ నంబర్ 3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకువచ్చే పేరుతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేయవద్దని, తక్షణమే ఆర్డినెన్సు జారీ చేసి జీఓ నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు.
అరకులో ఆగస్టు 10న జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జీఓ నం.3కు ప్రత్యామ్నాయ చట్టం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి న్యాయ నిపుణులతో చర్చిస్తామని ప్రకటించడం కాలయాపనకు దారితీసే విధంగా ఉందని వారు విమర్శించారు.
గతంలో సాలూరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో, రంపచోడవరంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శితో, పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం ఐటీడీఏల్లో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్తో సమావేశాలు, వర్క్షాప్లు నిర్వహించారని తెలిపారు. అలాగే జూలై 28న పాడేరులో రాష్ట్ర హోం మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, ఆదివాసీ ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిగాయని గుర్తుచేశారు.
ఇన్ని సమావేశాలు, ప్రజాభిప్రాయ సేకరణలు జరిగిన తర్వాత కూడా జీఓ నం.3, 1/70 చట్టం పరిరక్షణపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించేలా నిర్దిష్ట కాలపరిమితిలో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అక్టోబర్లో డీఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఉపాధ్యాయ నియామకాల్లో గిరిజనుల రిజర్వేషన్ హక్కులకు రక్షణ కల్పించేందుకు తక్షణమే ఆర్డినెన్సు జారీ చేసి, ఆరు నెలల్లో చట్టం చేయాలని కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్ ప్రభుత్వాన్ని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe