ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Grand Felicitation Pravalika

—-జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు యేకుల అనిత సురేష్

—ఆసియా అండర్-23 విజేత ప్రవళికను స్వయంగా వెళ్లి సత్కరించిన జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు యేకుల అనిత సురేష్

ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం కావాలి: యేకుల అనితా సురేష్

Grand Felicitation Pravalika : డిండి గుండ్ల పల్లి జూలై 16, త్రినేత్రం న్యూస్. ఇటీవల చైనాలో జూలై 9 నుండి 12 వరకు నిర్వహించిన మొదటి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026 పోటీల్లో, 4×400 మీటర్ల రిలే రేస్‌లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని చాటిన క్రీడాకారిణి నారిమల్ల ప్రవళిక ఘనత గురించి తెలుసుకుని నల్గొండ జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ యేకుల అనితా సురేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రవళిక సాధించిన అద్భుత విజయాన్ని తెలుసుకున్న ఆమె స్వయంగా నల్గొండ జిల్లా డిండి గ్రామంలోని గురుకుల పాఠశాలకు వెళ్లారు. అక్కడ ప్రవళికను ప్రత్యక్షంగా కలుసుకుని, శాలువాతో ఘనంగా సత్కరించి, స్వీట్లు పంచి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా యేకుల అనితా సురేష్ మాట్లాడుతూ అత్యంత నిరుపేద కుటుంబ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, అన్ని అడ్డంకులను అధిగమించి ప్రవళిక అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు.
నేటి సమాజంలో ఆడపిల్లలు ఏ రంగంలోనూ తక్కువ కాదు. చదువుతో పాటు క్రీడలు, అంతరిక్షం, రాజకీయాలు.. ఇలా అన్ని రంగాల్లోనూ అబ్బాయిలతో సమానంగా, అంతకంటే మిన్నగా దూసుకుపోతున్నారు. ఆడపిల్లలను కేవలం ఇంటికే పరిమితం చేయకుండా, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ వేదికలపై దేశ జెండాను ఎగరేస్తారని ప్రవళిక నిరూపించిందన్నారు.
నారిమల్ల రాంబాబు, విజయల దంపతుల కుమార్తె అయిన ప్రవళిక కనబరిచిన ప్రతిభ అమోఘమన్నారు. యువత అంతా ఆమెను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో కూడా స్వర్ణ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రవళికను ఇంతటి విజేతగా తీర్చిదిద్దిన కోచ్ పరశురాముని, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శిరీషను, మరియు ఆమె తల్లిదండ్రులను ఈ సందర్భంగా స్వయంగా ప్రత్యేకంగా అభినందించారు.

నా లక్ష్యం ఒలింపిక్స్ స్వర్ణమే: క్రీడాకారిణి ప్రవళిక

సన్మాన గ్రహీత, అంతర్జాతీయ అథ్లెట్ ప్రవళిక మాట్లాడుతూ… తన తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమేనని ధీమా వ్యక్తం చేశారు. పేద కుటుంబం అయినప్పటికీ తన క్రీడా ప్రయాణంలో స్థానిక దేవరకొండ శాసనసభ్యులు ఎంతో ప్రోత్సహించి, గేమ్స్ ఆడటానికి సహకరించారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా తనకు మరిన్ని వసతులు, మెరుగైన శిక్షణ సౌకర్యాలు కల్పిస్తే దేశానికి ఖచ్చితంగా స్వర్ణ పతకాన్ని అందిస్తానని ఈ సందర్భంగా ప్రవళిక ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శిరీష, పాఠశాల సిబ్బంది, మరియు అవుట మల్లేష్, ఎర్ర వెంకటయ్య పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page