
RTI Board : కొండ మల్లేపల్లి సెప్టెంబర్ 18, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్ సి- సమగ్ర శిక్ష) కార్యాలయంలో ఆర్టీఐ సమాచార బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ (ఆర్ టీ ఐ ఎస్ ఎస్) వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు కె. బాబురాం నాయక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం ఏర్పాటు చేయాల్సిన పౌర సమాచార బోర్డును విస్మరిస్తూ స్థానిక ఎంఈఓ నాగేశ్వరరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా బాబురాం నాయక్ మాట్లాడుతూ.. ఆర్టీఐ సెక్షన్ 4(1)(b) ప్రకారం కార్యాలయం ఎదుట పౌర సమాచార అధికారి (PIO), అప్పీలేట్ అధికారుల పేర్లు, హోదాలు, ఫోన్ నంబర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని ఎంఈఓ నాగేశ్వరరావు కి ఇప్పటికే స్వయంగా నాలుగు సార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నాలుగు సార్లు కోరినా ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆయన అలసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. సమాచార బోర్డు లేకపోవడం వల్ల మండల పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు సమాచారం కోసం ఏ అధికారిని సంప్రదించాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు చెప్పినా నిబంధనలను లెక్కచేయని ఎంఈఓ నాగేశ్వరరావుపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (డీ ఈ ఓ), పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్చరించారు. అంతేకాకుండా రాష్ట్ర సమాచార కమిషన్లో సెక్షన్ 20 కింద కఠిన క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానా విధించాలని పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎంఆర్సీ కార్యాలయం వద్ద యుద్ధప్రాతిపదికన ఆర్టీఐ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ టీ ఐ ఎస్ ఎస్ నాయకులు ఎండి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe