జూలై 5, 2026

WhatsApp Image 2024 03 09 at 11.18.54 PM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఫంక్షన్‌ హాళ్లలో పరిమితులకు లోబడే శబ్దం ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. శబ్ద నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన నిబంధనల అమలుపై స్థాయీ నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌, బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్‌, ఇంపీరియల్‌ గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాళ్లలో పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉంటోందని మిలిటరీ అదనపు చీఫ్‌ ఇంజినీర్‌ కర్నల్‌ జె.సతీష్‌ భరద్వాజ్‌ హైకోర్టుకు లేఖ రాశారు. అర్ధరాత్రి 12 దాటినా శబ్దాలు పరిమితికి మించి ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ రాతపూర్వక వివరణను కోర్టుకు సమర్పించారు. శబ్ద నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 5న నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లకు సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిపారు. రాత్రి 10 గంటల తరువాత ఎలాంటి డీజే, బ్యాండ్‌ల శబ్దం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. బోయినపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని బాంటియా గార్డెన్స్‌, ఇంపీరియల్‌ గార్డెన్స్‌కు సంబంధించి రెగ్యులర్‌గా గస్తీ నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కంటోన్మెంట్‌ పరిధిలోని ఫంక్షన్‌ హాళ్లపై అధికారం ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇప్పటికైనా ఆయా ఫంక్షన్‌ హాళ్లపై చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్‌ బోర్డును ఆదేశించింది. సదరు ఫంక్షన్‌ హాళ్లను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

You cannot copy content of this page