ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 17 at 11.40.33

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ అధికారులు వేగం పెంచారు. దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుంతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2014లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సమయం, ఎన్నికలు జరిగిన సమయాన్ని ప్రాధమికంగా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లపై ముందుకెళ్తున్నారు.

పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇతర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా పలు సూచనలు జారీ చేస్తున్నారు.

మరోవైపు ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈసీ అధికారులు. తాజాగా ఎన్నికల సన్నద్దత, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లాలవారీగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల సిబ్బంది నిర్వహణ, ఓటర్ లిస్ట్ తయారీ, ఓటర్ కార్డుల పంపిణీ, పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు ఏర్పాట్లపై, శాంతిభద్రతలపై జిల్లాల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఓటర్ జాబితా తయారీ, శాంతిభద్రతలపై కీలక సూచనలు చేశారు.

ఓటర్ జాబితా తయారీపై కీలక ఆదేశాలు..

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్న సిబ్బంది జాబితా తయారీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఎన్నికల సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే 20 శాతం అదనంగా ఉండాలన్నారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉన్న జిల్లాలు అదనపు సిబ్బందిని సమకూర్చుకునే అవకాశాలపై వెంటనే రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

పోలింగేతర విధులకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా సమస్యాత్మక ప్రాంతాల నివేదిక అందించాలని అన్ని జిల్లాల ఎస్పీలను సీఈవో మీనా ఆదేశించారు.

అన్ని జిల్లాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టుల విషయంలో ఆయా జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మేజర్ రూట్లతో పాటూ మైనర్ రూట్లలోనూ నిరంతరం పర్యవేక్షణ ఉండేలా మొబైల్ స్క్వాడ్ లు, స్టాటిక్ స్క్వాడ్‎లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదు అరికట్టేలా పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని సీఈవో మీనా సూచించారు.

You cannot copy content of this page