అనంతగిరి, జనవరి 8, (త్రినేత్రంన్యూస్): పల్లె పండుగ–2.0 కార్యక్రమంలో భాగంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో అనంతగిరి మండలం చిలకలగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని ధోనిలోవ గ్రామంలో నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా చిట్టం మురళి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి వల్ల గ్రామస్తులకు రాకపోకలు సులభమవడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. చిలకలగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో అవసరమైన అన్ని అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం దశలవారీగా చేపడుతుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి పాల్గొని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ టీ.మెతుల, స్థానిక సర్పంచ్తో పాటు మండల ఉపాధ్యక్షులు బీమరాజు, క్లస్టర్ ఇన్చార్జి మహేష్, అంగరయ్య, జనసేన నాయకులు లక్ష్మణ్, చిలకలగడ్డ పంచాయతీ ఇన్చార్జి సన్యాసిరావు, ఎనర్జీఎస్ అధికారులు ఏపీడీ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నూతన రోడ్డు నిర్మాణంతో గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు పడిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల ముఖచిత్రం మారుతుందనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం మరింత బలపరిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


