పైలట్గా 5 గ్రామాలు ఎంపిక..
వచ్చే వారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం..
Trinethram News : తెలంగాణలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి సర్వే చేయని, లేదా సర్వే రికార్డులు లేని 413 గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఈ సమస్యకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించిందని తెలిపారు. వచ్చే వారం నుంచి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని, 413 గ్రామాల్లోని ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించి దానిలో వచ్చే ఫలితాన్ని బట్టి మిగిలిన గ్రామాల్లోనూ రీ సర్వే చేపడతామన్నారు. ఆయా గ్రామాలలో ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ రెండు పద్ధతులలో విస్తృత సర్వే జరుగుతుందన్నారు.. ఏరియల్/డ్రోన్ సర్వే పద్ధతి ఒకటి కాగా, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి రెండోదని పేర్కొన్నారు. రెండు పద్ధతుల్లోనూ సర్వే చేసి జియో రిఫరెన్డ్స్, క్యాడస్ట్రల్ మ్యాపులు, హక్కుల నమోదు పత్రాలను తయారు చేస్తారని తెలిపారు.
ఈ నూతన విధానాల వలన భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందని, రైతులు, గ్రామీణ భూయజమానులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలలో రీ సర్వేలో అనుభవం కలిగిన ఆర్వీ అసోసియేట్స్, మార్వెల్ జియో స్పేషియల్, ఐఐసీ టెక్నాలజీస్, నియో జియో, డ్రోగో డ్రోన్ సంస్థలను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. కాగా, మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్ నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి(కొత్తది), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను పైలట్ సర్వే కోసం ఎంపిక చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


