సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన పతంజలి

TRINETHRAM NEWS

భవిష్యత్‌లో ఆ ప్రకటనలు ఇవ్వబోమని వెల్లడి

పతంజలి ఆయుద్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. భవిష్యత్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వబోమని వెల్లడించింది…

ఈ మేరకు పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ గురువారం అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. అంతకుముందు యోగా గురువు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలను వ్యక్తి గతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, పతంజలి ఆయుర్వేద సంస్థ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తుందని ఆరోపిస్తూ..ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతేడాది నవంబర్‌లో దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని పతంజలికి సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కోటి జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతో సంస్థ సైతం అటువంటి ప్రకటనలు చేయబోమని కోర్టుకు హామీఇచ్చింది.

కానీ అప్పటి నుంచి పతంజలి సంస్థ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తూనే ఉంది. దీంతో మార్చి 19న ఈ కేసు విచారణకు రాగా..ఈ విషయంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రామ్ దేవ్, బాలక్రిష్ణలపై ధిక్కార నోటీసులు జారీ చేసింది. వీరిద్దరూ తదుపరి విచారణ సమయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో బాలకృష్ణ గురువారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల తర్వాత సాధారణ ప్రకటనలు మాత్రమే ఇచ్చామని, అయితే అనుకోకుండా కొన్ని నేరపూరిత వాఖ్యాలను జోడించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రకటనలు ఇవ్వబోమని, పౌరులను ఆరోగ్య వంతంగా చేయడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. కాగా, ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 2న జరగనుంది.

You cannot copy content of this page

Scroll to Top