అల్లూరిజిల్లా(పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 23: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డీఎస్సీలో షెడ్యూల్ ఏరియాకు చెందిన ఉపాధ్యాయ పోస్టులను మినహాయిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం పాడేరు ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేపట్టారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ శాఖ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గురుకులాలు, ఉన్నత పాఠశాలల్లో మొత్తం 4680 ఉపాధ్యాయ పోస్టులను నోటిఫై చేశారని, వాటిలో ఆదివాసులకు కేవలం 700 పోస్టులు మాత్రమే కేటాయించబడినట్టు తెలిపారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి 400 పోస్టులు నోటిఫై చేసినప్పటికీ, ఆదివాసులకు కేవలం 24 పోస్టులు మాత్రమే లభించాయని ఆరోపించారు.
జిల్లాలో 96 శాతం ఆదివాసీ జనాభా ఉన్నా, వారికి కేవలం 6 శాతం పోస్టులు కేటాయించబడడమనే విషయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, 6 శాతం ఉన్న గిరిజనేతరులకు 96 శాతం ఉపాధ్యాయ పోస్టులు కేటాయించడమంటే అది తీవ్ర అన్యాయం అని వ్యాఖ్యానించారు.
ఆదివాసీ గిరిజనుల నిరంతర పోరాటంతోనే రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేసిన బాలదేవ్, ముఖ్యమంత్రి పాడేరు పర్యటనకు ముందే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నుండి షెడ్యూల్ ఏరియా ఉపాధ్యాయ పోస్టులను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు ఉధృత పోరాటాలకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు టి.కృష్ణారావు, బుజ్జిబాబు, సహాయ కార్యదర్శులు కొర్రా బాలయ్య, సాగిన చిరంజీవి, కమిటీ సభ్యులు రమేష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


