
New Scheme : త్రినేత్రం న్యూస్ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపట్టింది.
త్వరలోనే రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు.. ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన ప్రకటనను చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని అమలు చేసేందుకు.. మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది.
ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాను కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించి.. మంగళవారం రోజున మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయి.. చర్చించి, దానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయనున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం లేదా విపత్తు జరిగి కుటుంబాన్ని నడిపించే.. యజమాని చనిపోతే.. ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది.
ఈ పథకానికి అర్హుల ఎంపికకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, నిబంధనలను ఖరారు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కేబినెట్ సబ్ కమిటీని నియమించగా.. తాజాగా మంత్రుల బృందం సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభించాలని.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా తెలిపింది.
ఆ గడువు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద రూ.5 లక్షల జీవిత బీమాను తెలంగాణలోని 1.15 కోట్ల కుటుంబాలకు వర్తింపజేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ధనిక, పేద అనే తేడా లేకుండా తెలంగాణలోని ప్రతీ ఒక్క కుటుంబానికి ఈ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

