అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 16: ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ మే 16న పాడేరు లో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని అన్ని వర్గాల ఆదివాసీ ప్రజలకు పిలుపునిచ్చింది.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో ఐటిడిఏ పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి, ప్రత్యేకంగా ఆదివాసుల కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఆదివాసుల కోసం 100 శాతం రిజర్వేషన్ అంశంపై స్పష్టత లేకపోవడాన్ని కమిటీ తీవ్రంగా విమర్శించింది.
కమిటీ కన్వీనర్ ఎం. రమేష్ కుమార్, కో-కన్వీనర్లు కొర్రా శ్యామ్, కిల్లో దాసు, అడకట్ల అభి, గుజ్జెల సురేష్ మీడియాతో మాట్లాడుతూ, గతంలో జరిగిన ఉద్యమాల ప్రభావంతో ముఖ్యమంత్రి స్పందించినప్పటికీ, స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీతో పాటు ప్రత్యేకంగా ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, లేకపోతే మెగా డీఎస్సీ నుండే ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించాలని వారు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయకుండానే మెగా డీఎస్సీని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఆదివాసీ యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కమిటీ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో అన్ని గిరిజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మహిళా సంఘాలు, డీఎస్సీ అభ్యర్థులు ఏకతాటిపైకి రావాలని, మే 16న పాడేరు లో జరిగే రాష్ట్ర సదస్సులో భారీ సంఖ్యలో పాల్గొని, భవిష్యత్ పోరాట కార్యాచరణను ఖరారు చేయాలని కమిటీ పిలుపునిచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


