జూలై 24, 2026
TRINETHRAM NEWS
Legislator Mega Parents-Teachers Meeting

Legislator Mega Parents-Teachers Meeting : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 24; తిరువూరు నియోజకవర్గం, మండలం, పట్టణంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాల ( బాలికలు) నిర్వహించినటువంటి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మీటింగ్ లో డైనమిక్ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఆయన విద్యార్థినులతో ఆత్మీయంగా ముఖాముఖి నిర్వహించారు. చదువుపై ఆసక్తి, భవిష్యత్తులో ఏ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని వాళ్లను అభినందించారు. .జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి ఎంతో అవసరమని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ప్రతి విద్యార్థి తన కలలను సాకారం చేసుకోగలడని తెలిపారు.

అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని, మంచి నడవడిక, విలువలు, క్రమశిక్షణతో ముందుకు సాగితే సమాజంలో ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా ఎదగవచ్చని విద్యార్థినులకు హితవు పలికారు._

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇటీవలే విడుదల చేసిన తల్లికి వందనం పథకం నిధులను పిల్లల విద్యాభివృద్ధి, విద్యా అవసరాల కోసం వినియోగించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కాకుండా ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఇతర విద్యా సౌకర్యాలు అందిస్తోందని గుర్తు చేశారు.

తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ చూపాలని, వారి ప్రతిభను ప్రోత్సహించాలని, మంచి వాతావరణాన్ని కల్పించాలని పాఠశాల–తల్లిదండ్రుల సమన్వయం బలపడితే విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు, నైపుణ్యాభివృద్ధి, నైతిక విలువల పెంపుపై ఉపాధ్యాయులతో చర్చించారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను వెలికితీసుకుని సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాలలో విద్యా బోధనలో విశేష సేవలు అందిస్తూ విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించడంలో విశిష్ట కృషి చేస్తున్న ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలు జయశ్రీ నీ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, సమాజ నిర్మాణానికి గురువుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో సేవలందిస్తున్న జయశ్రీ గారిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో విద్యా సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఎంఆర్వో గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page